ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు గుజరాత్ జెయింట్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైంది.
గాయం వల్లే దూరం.
యస్తిక భాటియా మోకాలి గాయంతో బాధపడుతున్నారు. ఇదే గాయం కారణంగా ఆమె ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్తో పాటు వన్డే ప్రపంచ కప్కు కూడా దూరమయ్యారు. ఆమె స్థానంలో భారత జట్టులోకి ఉమా ఛెత్రిని తీసుకున్నారు. అయితే డబ్ల్యూపీఎల్ సమయానికి యస్తిక కోలుకుంటుందని ఆశించినప్పటికీ.. ఆమె ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయారు. దీంతో ఈ సీజన్లో ఆమె ఆడటం లేదని స్పష్టమైంది.

గుజరాత్ జట్టుకు డబుల్ షాక్!
యస్తిక దూరం కావడం ఒక ఎత్తయితే, ఆమె స్థానంలో మరో కొత్త ప్లేయర్ను తీసుకునే అవకాశం గుజరాత్ జెయింట్స్కు లేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. వేలానికి ముందే ఒక ఆటగాడు గాయపడి ఉంటే, ఆ ప్లేయర్ స్థానంలో రీప్లేస్మెంట్ను తీసుకోవడానికి అనుమతి ఉండదు. యస్తికను వేలంలో రూ. 50 లక్షలకు కొనుగోలు చేసినప్పుడే ఆమె గాయంతో ఉన్నారు. ఇదే రూల్ ఆర్సీబీ ప్లేయర్ పూజా వస్త్రాకర్, యూపీ వారియర్స్ ప్లేయర్ ప్రతిమ రావత్లకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ వీరు కూడా ఫిట్నెస్ సాధించలేకపోతే, ఆ జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకోవడానికి వీలుండదు.
టైటిల్ కోసం గుజరాత్ నిరీక్షణ
మహిళా ప్రీమియర్ లీగ్ చరిత్రలో గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. మొదటి రెండు సీజన్లలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మూడవ సీజన్ (2025)లోఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్తో ఓడిపోయి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్లో ఎలాగైనా కప్పు గెలవాలని పట్టుదలతో ఉన్న గుజరాత్ జట్టుకు, యస్తిక వంటి కీలక ఆటగాడు దూరం కావడం పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. జట్టు సభ్యులందరూ యస్తిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోను కూడా షేర్ చేశారు.