IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సీఎస్కేపై విజయం సాధించినందుకు మేకను బలి ఇచ్చి దాని రక్తంతో విరాట్ కోహ్లీ పోస్టర్కు అభిషేకం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ముగ్గురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో వివిధ పార్టీలు ఆర్సీబీ అభిమానులను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కర్ణాటకలో చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూరు తాలూకాలోని మరియమ్మనహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అక్కడ కొంతమంది యువకులు మేకను విరాట్ కోహ్లీ పోస్టర్ ముందు బలి ఇచ్చి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆర్సీబీ అభిమానుల అరెస్ట్
అరెస్ట్ చేయబడిన వ్యక్తులను సన్న పాలయ్య(22), జయన్న(23), తిప్పేస్వామిలుగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ చర్య జంతు సంక్షేమ సంఘాలు, సాధారణ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. 20 సెకన్ల వీడియోలో విరాట్ కోహ్లీ పోస్టర్ ముందు ఓ వ్యక్తి మేకను పట్టుకుని ఉన్నట్లు కనిపించింది. మరొక వ్యక్తి సీఎస్కే ఆర్సీబీ విజయాన్ని గుర్తు చేసుకుంటూ మేకను కత్తితో విధించాడు. ఆ తర్వాత ఆ రక్తాన్ని విరాట్ కోహ్లీ పోస్టర్కు రక్తాభిషేకంగా అర్పించారు. మూడో వ్యక్తి మేకను తాడుతో పట్టుకుని సాయం చేశాడు.

ఆటగాడిపై అభిమానం ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా మంది జంతు హింసను ప్రోత్సహించినందుకు దీనిని తీవ్రంగా ఖండించారు. స్థానిక అధికారులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
మే 3(శనివారం)న చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జేకబ్ బేతెల్(55), విరాట్ కోహ్లీ(62), రొమారియో షెపర్డ్(53) అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో మతీషా పతిరానా 3 వికెట్లు పడగొట్టగా, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నాడు.
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదన చెన్నై సూపర్ కింగ్స్.. చివరి ఓవర్ వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుష్ మాత్రే(94), రవీంద్ర జడేజా(77) సీఎస్కేను గెలిపించేందుకు పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సీఎస్కే చివర్ ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, కృనాల్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.