T20 World Cup 2026: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. అయితే ఈ జట్టులో స్టార్ ఆటగాడు శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. గత కొంతకాలంగా టీమిండియాలో కీలక ఆటగాడిగా.. టెస్టు, వన్డేలకు కెప్టెన్గా, టీ20లకు వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పక్కన పెట్టడం గమనార్హం.
గిల్కు షాక్.. గంభీర్ మౌనం
ఈ సంచలన నిర్ణయం వెలువడిన కొద్ది గంటలకే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముంబై నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. శుభ్మన్ గిల్ను సెలెక్ట్ చేయకపోవడంపై ప్రశ్నిస్తూ మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు. అయితే గౌతమ్ గంభీర్ ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వకుండా వింతగా ప్రవర్తించారు. మీడియాను పూర్తిగా విస్మరిస్తూ.. మౌనంగా తన కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. హెడ్ కోచ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గిల్ను పక్కన పెట్టడానికి కారణాలేంటి?
శుభ్మన్ గిల్ జట్టు నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అతని పేలవమైన ఫామ్ అని తెలుస్తోంది. టీ20ల్లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్లో మెరుపులు మెరిపించడంలో గిల్ విఫలమయ్యాడు. శుభ్మన్ గిల్ స్ట్రైక్ రేట్(137.26) ఆశించిన స్థాయిలో లేదు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశాక ఆడిన 15 మ్యాచ్ల్లో గిల్ కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీ ఓపెనింగ్లో మెరుగైన ప్రదర్శన చేస్తుండటంతో శుభ్మన్ గిల్కు చోటు కరువైంది.
కొత్త వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్
శుభ్మన్ గిల్కు చోటు లభించకపోవడంతో టీ20 జట్టుకు కొత్త వైస్ కెప్టెన్ అవసరమైంది. సెలెక్టర్లు ఈ బాధ్యతను ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు అప్పగించారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ వారసుడిగా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నారు. ఇక వరల్డ్ కప్లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్ జట్టు:
సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్(కీపర్), హర్షిత్ రాణా.