

హైదరాబాద్: ఆసియాకప్లో భాగంగా అప్ఘనిస్థాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో మూడు బంతులు మిగిలి ఉండగా పాక్ విజయం సాధించింది. వరుస విజయాలతో గ్రూప్-బిలో టాపర్గా నిలిచిన అప్ఘనిస్తాన్ శుక్రవారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ను ఎదుట నిలువలేకపోయింది.
ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ కెప్టెన్ ఆస్గర్ బంతిని పేసర్ అఫ్తాబ్ అలమ్ చేతికి ఇచ్చాడు. అఫ్తాబ్ అలమ్ బౌలింగ్లో షోయబ్ మాలిక్ సిక్స్, ఫోర్ కొట్టి పాక్కు విజయాన్ని అందించాడు. పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ సమయోచితంగా ఆడి జట్టును గెలిపిస్తే, తన బౌలింగ్ కారణంగా జట్టు పరాజయం పాలుకావడాన్ని అఫ్తాబ్ అలమ్ జీర్ణించుకోలేపోయాడు.
మ్యాచ్ అనంతరం అఫ్తాబ్ అలమ్ మైదానంలోనే మోకాళ్లపై కూలబడి కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో అలమ్ను ఓదార్చడం మాలిక్ వంతైంది. కాసేపు గ్రౌండ్లో అలమ్ కూర్చుండిపోగా అతని భుజాలపై చేయి వేసి ధైర్యం చెప్పాడు. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాలిక్ ప్రత్యర్థి ఆటగాడ్ని ఓదార్చి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్లో షోయబ్ మాలిక్ 51 పరుగులతో నాటౌట్గా నిలిచి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.
అనంతరం 258 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హక్(80), బాబర్ అజామ్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు రెండో వికెట్కు 154 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.