హైదరాబాద్: పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అభిమానుల అడిగిన ప్రశ్నలకు గాను సమాధానాలిచ్చి షోయబ్ మాలిక్ చిక్కుల్లో పడ్డాడు.
టీమిండియా పేసర్ మహ్మద్ షమీని ఉద్దేశించి షోయబ్ మాలిక్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన అధికారిక ట్విట్టర్ పేజిలో మే 26 (శుక్రవారం) #AskShoaib అనే ట్యాగ్తో ఓ క్యాంపెయిన్ నిర్వహించింది.

ఈ క్యాంపెయిన్లో భాగంగా అభిమానులు వేసే ప్రశ్నలకు షోయబ్ మాలిక్ సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో బక్వర్ అలీ అనే నెటిజన్ 'భారత్లో బెస్ట్ బౌలర్ ఎవరు?' అని ప్రశ్న వేశాడు. దీనికి 'భారత్ జట్టులో అత్యుత్తమ బౌలర్ మహ్మద్ షమీ. అతడు ముస్లిం గయ్ కాబట్టి. అతని బౌలింగ్ చూశాను. అతడి బౌలింగ్ను కూడా ఎదుర్కొన్నా. అతడి బౌలింగ్ ఎదుర్కొనడం కఠినంగా అనిపించంది' అని షోయబ్ మాలిక్ సమాధానమిచ్చాడు.
అయితే మతం ఆధారంగా షోయబ్ మాలిక్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఈ విషయంలో కొంతమంది యూజర్లు షోయబ్ మాలిక్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 4వ తేదీన తన తొలి మ్యాచ్లో భాగంగా భారత్, పాక్తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే పాకిస్థాన్ జట్టులో షోయబ్ మాలిక్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. షోయబ్ మాలిక్... భారత్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను వివాహమాడిన సంగతి తెలిసిందే.
షోయబ్ మాలిక్ వ్యాఖ్యలపై మండిపడుతున్న అభిమానులు: