
హైదరాబాద్: న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా తలకు తగలడంతో పాకిస్థాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ మైదానంలో కుప్పకూలిపోయాడు. బాధతో విలవిల్లాడుతున్న షోయబ్ మాలిక్ను వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స అందించారు.
హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 32వ ఓవర్లో షాట్ కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బంతి ఫీల్డర్ మున్రో చేతికి చేరడంతో అవతలి ఎండ్లో ఉన్న మహమ్మద్ హఫీజ్ వద్దని వారించాడు.
దీంతో మాలిక్ వెనక్కి మళ్లాడు. ఈ క్రమంలో రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన మున్రో బంతిని బలంగా వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా మాలిక్ తల వెనకవైపు బలంగా తాకడంతో షోయబ్ మాలిక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది మాలిక్ను గ్రౌండ్ నుంచి తీసుకెళ్లి అతనికి ట్రీట్మెంట్ అందించారు.
దీంతో కోలుకున్న అతను మూడు బంతుల అనంతరం తిరిగి బ్యాటింగ్కు వచ్చాడు. అయితే దెబ్బ బలంగా తాకడంతో ఏకాగ్రత కోల్పోయిన షోయబ్ మాలిక్(6) ఆ వెంటనే పెవిలియన్కు చేరాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో పాక్పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాట్స్మెన్ మహ్మద్ హఫీజ్ (81) రాణించడంతో 50 ఓవర్లలో 8 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఫకార్ జమాన్ (54), హారిస్ సోహైల్ (50), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం 263 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.