షోయబ్ ప్రదర్శనపై ఆశల్లేవ్
ఈ నేపథ్యంలో.. అతనిపై ఎలాంటి ఆశలనూ పెట్టుకోలేదు టీమ్ మేనేజ్మెంట్. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో గొప్పగా రాణిస్తాడని అనుకోవట్లేదు. అందుకే- అతణ్ని రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం అతని వయస్సు 38 సంవత్సరాలు. ప్రపంచకప్ టోర్నమెంట్లో ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటోన్న ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. పైగా- భారత్తో మ్యాచ్కు ముందు రోజు రాత్రి మాంఛెస్టర్లోని విల్స్లో రోడ్డులోని 360 శీషా రెస్టారెంట్లో తన భార్యతో కలిసి అర్ధరాత్రి దాటిపోయేంత వరకూ విందు, వినోదాలతో కాలక్షేపం చేశాడనే విమర్శలను తీవ్రంగా ఎదుర్కొంటున్నాడు కూడా. రెండు మ్యాచ్లల్లో డకౌట్ కావడం, భారత్ మ్యాచ్ను తేలిగ్గా తీసుకోవడం వంటి అతని చర్యలు టీమ్ మేనేజ్మెంట్ను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. అందుకే అతణ్ని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. షోయబ్ స్థానంలో మిడిలార్డర్లో సొహైల్ను ఆడిస్తారని అంటున్నారు.
భారీగా పరుగులు ఇచ్చేస్తోన్న హసన్..
షోయబ్తో పాటు ఫాస్ట్ బౌలర్ హసన్ అలీకి కూడా తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని అంటున్నారు. భారత్తో మ్యాచ్లో భారీగా పరుగులను సమర్పించుకున్నాడతను. తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులను ఇచ్చుకున్నాడు. ప్రపంచకప్ ఆరంభం నుంచీ అతని ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. వారిద్దరి స్థానంలో హ్యారిస్ సొహైల్, షహెన్షా అఫ్రిదీలను ఆడించే అవకాశాలు ఉన్నాయి. హ్యారిస్ సొహైల్, షహెన్షా అఫ్రిదీ ఓ మోస్తరుగానైనా రాణించగలిగితే.. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లన్నింటికీ షోయబ్ మాలిక్, హసన్ అలీ దూరమైనట్టేనని అంచనా వేస్తున్నారు క్రికెట్ పండితులు.
ప్రపంచకప్ భారత్దే అంటూ ట్వీట్..ఆనక డిలెట్
ఈ సారి ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకుంటుందని అంటూ హసన్ అలీ జోస్యం చెప్పడం అటు పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్కు, ఇటు ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీనితో అతను ఆ ట్వీట్ను తొలగించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హసన్ అలీ నుంచి వివరణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను ఉద్దేశపూరకంగా ఆ ట్వీట్ చేయలేదని, తాను ఆ ట్వీట్ చేయడానికి ఎలాంటి కారణాలు లేవని అతని బోర్డుకు వివరణ ఇచ్చుకున్నాడట. హసన్ అలీపై వేటు వేయడానికి ఇదీ ఓ కారణమని సమాచారం.