
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆసియా కప్ 2023 ఆతిథ్యం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ టోర్నమెంట్ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు దక్కాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును అక్కడకు పంపడం జరగదని, ఈ టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని బీసీసీఐ సెక్రటరీ, ఏసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా అన్నాడు. అప్పటి నుంచి ఈ విషయంలో బీసీసీఐ, పీసీబీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలో పాక్ లెజెండర్ క్రికెటర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్ కోసం కనుక భారత జట్టు తమ దేశానికి రాకుంటే.. తాము కూడా వన్డే వరల్డ్ కప్ కోసం భారత్కు వెళ్లబోమని, ఆ టోర్నీని బాయ్కాట్ చేస్తామని పీసీబీ పెద్దలు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ఆతిథ్యం గురించి మాట్లాడిన అక్తర్.. ఈ టోర్నీని పాకిస్తాన్లోనే నిర్వహించాలని కోరాడు. ఒకవేళ పాక్లో కుదరకపోతే శ్రీలంకలో నిర్వహించాలన్నాడు. అలాగే ఈ టోర్నీతోపాటు వన్డే వరల్డ్ కప్లో కూడా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్ చేరితే చూడాలని ఉందని, ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో వచ్చే మజా మరెక్కడా రాదని చెప్పాడు.
ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ మాస్టర్స్ ఆడేందుకు ఖతార్లో ఉన్న అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే పీసీబీ మాత్రం ఈ విషయంలో ససేమిరా అంటోంది. మిగతా దేశాలన్నీ పాకిస్తాన్కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పుడు ఒక్క భారత్కే భద్రతా సమస్యలు ఎందుకు వస్తున్నాయని పీసీబీ ప్రశ్నిస్తోంది. ఈ వంకలు చూపించి ఆసియా కప్లో భారత్ ఆడకపోతే.. తాము కూడా అదే సమస్యగా చూపించి వన్డే వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామని పీసీబీ చీఫ్ నజామ్ సేథి ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇకపై జరిగే ఏసీసీ, ఐసీసీ సమావేశాల్లో కూడా ఈ సమస్యను ఎత్తిచూపుతామని హెచ్చరించాడు. కాగా, ఆసియా కప్ 2023 నిర్వహించే వేదికల పేర్లను ఈ నెలలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.