
హైదరాబాద్: ప్రపంచంలో సంగీతాన్ని ఆస్వాదించేవాళ్లు చాలా మందే. ఇందుకు క్రికెటర్లు అతీతులు కారు. భర్త క్రికెటర్లలో ఎంతో మందికి పాటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కు. వీరూ బ్యాటింగ్ చేస్తూనే రాగాలు తీసేవాడు. ఒత్తిడి సమయాల్లో, పరుగులు రానప్పుడు ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ పాటల్ని అతడు ఆలపించేవాడు. దాంతో మనసుకు ప్రశాంతత దక్కేదని చాలాసార్లు చెప్పాడు. భారతీయులే కాకుండా పాకిస్తాన్ క్రికెటర్లకు, అభిమానులకు బాలీవుడ్ పాత పాటలంటే చాలా ఇష్టం. ఏ జాబితాలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ఉన్నాడు.
షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గొప్ప పేసర్ మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్ కూడా. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరే అతడు.. కిషోర్ కుమార్ పాటలను మధురంగా ఆలపించగలడు. అనేక సందర్భాల్లో అక్తర్ సన్నిహితులు, అభిమానుల ముందు తన గొంతు సవరించుకున్నాడు. ఒకప్పుడు అతడు పాటలు పాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ పాటలు విన్న ఫాన్స్ ఫిదా అయిపోయారు. 'షోయబ్ అక్తర్ అద్భుతం' అని ప్రశంసిస్తున్నారు.
'ఆతే జాతే ఖూబ్సూరత్ ఆవారా', 'మేరే నసీబ్ మై ఆయే దోస్త్' వంటి పాటలను షోయబ్ అక్తర్ ఆలపించాడు. మహ్మద్ రఫీ పాడిన 'చో లేనే దో నాజూక్ హోతో' తోనూ మైమరపించాడు. 2007లో సహారా వన్లో ప్రసారమైన 'ఝూమ్ ఇండియా' అనే రియాలిటీ షోలో తన గాత్రంతో అభిమానులను అలరించాడు. 2008లోనూ మరో షోలో పాటలు పాడాడు. ఆటకు వీడ్కోలు పలికాక అక్తర్ భారతీయ టీవీ షోల్లో పాల్గొనడం గమనార్హం. 2015లో కామెడీ నైట్స్ విత్ కపిల్, 2016లో మజాక్ మజాక్ మై, గేమ్ ఆన్ హైలో అతడు పాల్గొని సందడి చేశాడు.
రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రిటైర్మెంట్ అనంతరం అక్తర్ కామెంటేటర్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టాడు.