
కరాచీ: టీ20 ప్రపంచకప్ 2021లో భారత్తో ఫైనల్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఫైనల్లో కూడా మరోసారి టీమిండియాను ఓడించాలని ఉందన్నాడు. భారత్ ఫైనల్స్కు రావాలని కోరుకుంటున్నట్లు, అక్కడ తమని ఓడించడానికి మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఉందని అక్తర్ పేర్కొన్నాడు. మెగా టోర్నీలో పాకిస్థాన్తో ఆడిన తొలి మ్యాచులో భారత్ భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడిన అక్తర్.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్లకు సంబంధించిన 'మౌకా' ఆడ్వర్టైజ్మెంట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇప్పుడు సీన్ రివర్స్:
2015 నుంచి ప్రపంచకప్ టోర్నీల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్లకు సంబంధించి 'మౌకా మౌకా' పేరిట అడ్వర్టయిజ్మెంట్లు రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీల్లో ఇదివరకు పాకిస్తాన్ జట్టుపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించిన నేపథ్యంలో భారత్కు అనుకూలంగా.. పాక్కు వ్యంగ్యంగా ఆ అడ్వర్టయిజ్మెంట్లు ఉండేవి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021లో భారత్.. పాకిస్థాన్తో ఓడిన నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆ యాడ్పై తనదైన శైలిలో విమర్శలు చేశాడు.
భారత్తో ఫైనల్స్ కోసం ఎదురుచూస్తున్నాం:
'మేం భారత్తో ఫైనల్స్ కోసం ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే ఫైనల్ మ్యాచులో మరోసారి కోహ్లీసేనను ఓడించాలని ఉంది. అది జరగాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్స్లో భారత్ మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని చూస్తున్నాం. ఇక్కడ నేను 'మౌకా' అని పేర్కొనడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ పదం ఇప్పుడు పాకిస్థాన్ను అపహాస్యం చేసేది కాదు. మామూలుగా ఒక అడ్వర్టయిజ్మెంట్ రూపొందించడం, అది సరదాగా ఉండటం తప్పేం కాదు. కానీ ఒక దేశాన్ని కించపరిచే విధంగా మాత్రం అసలు ఉండకూడదు. మాది గర్వకారణమైన దేశం. ఇకపై మౌకా అనే పదం ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ కాదు' అని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు.
అఫ్గానిస్థాన్ను నిందించరాదు:
ఇక బుధవారం అఫ్గానిస్థాన్పై భారత్ గెలుపొందడంతో చాలా మంది పాకిస్తాన్ అభిమానులు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన షోయబ్ అక్తర్.. ఇందులో అనవసరంగా అఫ్గానిస్థాన్ను నిందించరాదని కోరాడు. అఫ్గానిస్థాన్ దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇలా వ్యాఖ్యానించడం పట్ల ఆ జట్టుకు ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు. అఫ్గాన్ బలమైన జట్టు కాదని, ఈ మ్యాచ్లో బలమైన టీమిండియాతో పోటీపడిందని ఆయన అభిప్రాయపడ్డాడు.