
కరాచీ: భారత దేశంలో తనకెన్నో మధుర స్మృతులు ఉన్నాయని పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ గుర్తుచేసుకున్నాడు. త్వరలోనే రెండు దాయాది దేశాల సంబంధాలు మెరుగవుతాయని ఆశించాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ తనని సొంత తమ్ముడిలా చూసుకొనేవారని పేర్కొన్నాడు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ధ్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్కు వెళ్లింది. ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్లో ఆఖరిసారిగా తలపడ్డాయి.
ఓ క్రీడా ఛానెన్లో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'భారత దేశం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం గతంలో కూడా చెప్పాను. ఇక ముంబై వాసులతో కలవడం నాకెంతో ఇష్టం. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలిసినప్పుడు భద్రంగా చూసేవాళ్లు. దురదృష్టవశాత్తూ ఐదేళ్లుగా భారత్కు రాలేదు. కానీ ఒకప్పుడు నన్ను అక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అడిగేవారు. ఎందుకంటే నేనంతగా అక్కడ పనిచేశాను' అని అన్నాడు. అక్తర్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా ఉన్న విషయం తెలిసిందే.
'భారత్లో నాకెన్నో మధురస్మృతులు ఉన్నాయి. నేను మళ్లీ భారత్లో అడుగుపెట్టాలని ప్రార్థిస్తున్నాను. మరికొన్ని నెలల్లో భారత్, పాకిస్తాన్ సంబంధాలు మెరుగవ్వాలని కొన్ని రోజుల ముందే నా మిత్రులతో అన్నాను. అలా జరగ్గానే భారత్లో వాలిపోయే మొదటి పాకిస్థానీని నేనే అవుతా. అంతేకాదు టన్నుల కొద్దీ డబ్బు సంపాదించుకుంటా' అని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సరదాగా అన్నాడు. అక్తర్కు భారత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో అతడికి సన్నిహితులు బాగానే ఉన్నారు. అంతేకాకుండా కొన్ని టీవీ రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు.
రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ టీమిండియాకు ఎప్పుడూ అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటాడు. బాగా ఆడిన ఇండియన్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటాడు. అలానే దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచులు జరగాలని నిత్యం కోరుకుంటాడు. అయితే ఇరు దేశాల మధ్య వివాదాల కారణంగా కొన్నేళ్లుగా భారత్-పాక్ ద్విపాక్షిక సిరీసుల్లో పాల్గొనడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్న విషయం తెలిసిందే. అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్లు ఆడిన అక్తర్.. 444 వికెట్లు పడగొట్టాడు.