
పాకిస్థాన్ను ఎప్పుడూ మోసం చేయలేదు
తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఏ బుకీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనని సంప్రదించలేదని షోయబ్ అక్తర్ తెలిపాడు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'పాకిస్థాన్ను ఎప్పుడూ మోసం చేయలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేననే నమ్మకం నాపై నాకుంది. నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేయకున్నా.. కొంతకాలం మ్యాచ్ ఫిక్సర్ల మధ్య ఉన్నా. మైదానంలో 22 మంది ఉంటారు. ఎవరికి తెలుసు.. ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్నారో' అని అక్తర్ చెప్పాడు.

అక్రమ్ని చంపేసేవాడిని
'1990 నుంచి మ్యాచ్లు చూసేవాడ్ని. ఎన్నో మ్యాచ్ల్లో వసీం అక్రమ్ తన అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టుని గెలిపించడం నేను చూశాను. ఒకవేళ అక్రమ్ నన్ను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని అడిగి ఉంటే.. అతడి కచ్చితంగా నాశనం చేసేవాడిని. చంపేందుకు కూడా వెనుకాడేవాడిని కాదు. అయితే అక్రమ్ నా వద్ద ఫిక్సింగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు' అని అక్తర్ వెల్లడించాడు.

అక్రమ్ బౌలింగ్పై ప్రశంసలు:
వసీం అక్రమ్ బౌలింగ్పై అక్తర్ ప్రశంసలు కురిపించాడు. 'అక్రమ్ జట్టులో ఉండగా.. ఏడు, ఎనిమిది సంవత్సరాలు ఆడాను. 1990ల్లో ఓడిపోయే మ్యాచ్లను అద్భుతమైన బౌలింగ్తో గెలిపించడాన్ని చూసి ఆశ్చపోయేవాడిని. టాప్-ఆర్డర్ వికెట్లు తీసే బాధ్యతను అతడు తీసుకొని.. నాకు టెయిల్-ఎండర్ల వికెట్లు వదిలేసేవాడు' అని పేర్కొన్నాడు. పాక్ తరఫున అక్తర్ 46 టెస్ట్ మ్యాచ్లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు.

ప్రపంచం గాడిలో పడాలంటే ఏడాది పడుతుంది:
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్లో ఆరంభం కావడానికి సుదీర్ఘ సమయం పట్టడం ఖాయమని అక్తర్ మరోసారి జోస్యం చెప్పాడు. 'ప్రస్తుతం ప్రపంచం లాక్డౌన్లోనే ఉంది. ఇప్పటివరకూ మెజార్టీ దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ ఎలా కొనసాగుతుందో కనబడుతుంది. ప్రపంచం గాడిలో పడాలంటే ఒక ఏడాది సమయం కచ్చితంగా పడుతుంది. ఇక క్రికెట్ మ్యాచ్లను కూడా అప్పుడే చూసే అవకాశం ఉంది. నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్లు జరగడానికి ఏడాది సమయం పడుతుంది. ఈ కరోనా ప్రభావం ఏడాది పాటు ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












