చిన్న పిల్లల ఆటకంటే దారుణంగా ఉంది:
తాజాగా షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ... 'ఒక్కసారి కివీస్ ఆటగాళ్ల ఆటతీరు గమనిస్తే చిన్న పిల్లల ఆటకంటే దారుణంగా ఉంది. పరుగులు తీయడానికి అపసోపాలు పడ్డారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడం అంటే.. ఆ జట్టు ఆట ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కీలక సమయంలో అందరూ చేతులెత్తేశారు. గెలవాల్సిన మ్యాచ్లను చేజేతులారా పోగొట్టుకున్నారు. నిజంగా వారి ఆట తీరు చూస్తే నాకు చాలా జాలి వేసింది' అని అన్నారు.
నా మనుసును గాయపరిచింది:
'కివీస్ జట్టులో అత్యంత అనుభవం ఉన్న బ్యాట్సమెన్ రాస్ టేలర్. తన అనుభవాన్ని ఉపయోగించి టేలర్ ఒక్క మ్యాచ్లో విజాయన్ని అందించలేకపోయాడు. ఒత్తిడి తట్టుకోలేక పెవిలియన్ చేరాడు. జట్టులోని ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విఫలమయ్యారు. ఏ ఒక్కరు తమ ప్రదర్శనతో ఆకట్టుకోలేదు. కొలిన్ మన్రో, టిమ్ సీఫెర్ట్లు మెరిసినా.. వారికి మద్దతిచ్చే ఆటగాళ్లు కరువయ్యారు. మ్యాచుల సమయంలో కివీస్ జట్టును చూసి చాలా కోపం వచ్చింది. వాళ్లు ఏ రకమైన క్రికెట్ ఆడారో నాకు అర్థం కాలేదు. వారి ఆట నా మనుసును గాయం చేసింది' అని అక్తర్ పేర్కొన్నారు.
కివీస్ స్టుపిడ్ క్రికెట్ ఆడింది:
'కివీస్ ఆట చిన్న పిల్లల ఆట కంటే దారుణంగా ఉంది. చిన్న పిల్లల ఆటలో కూడా సింగిల్స్ తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ కివీస్ ఆటగాళ్లు ఆలా కూడా చేయలేదు. కివీస్ స్టుపిడ్ క్రికెట్ ఆడింది. 40 బంతుల్లో 50 పరగులు చేయాల్సి ఉన్నప్పుడు ఏ జట్టైనా ఆచితూచి ఆడుతుంది. కానీ.. కివీస్ జట్టు ఓ చెత్త ప్రదర్శన చేసింది. ఈ సిరీస్లో న్యూజిలాండ్ సరిగ్గా ఆడి ఉంటే 3-2 ఫలితం వచ్చేది. రెండు మ్యాచ్లు సూపర్ఓవర్కు దారి తీసినా వాటిని కాపాడుకోవడంలో కివీస్ విఫలం అయింది. ఇప్పటికైనా తప్పుల నుండి నేర్చుకోవాలి' అక్తర్ సూచించారు.
బుమ్రా అమోఘం:
'భారత ప్రదర్శన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అమోఘం. మొదటి రెండు మ్యాచ్ల్లో విఫలమైనా.. తర్వాతి మ్యాచ్ల్లో తన సత్తా ఏంటో చూపెట్టాడు. టీమిండియా ఆటగాళ్లు అందరూ బాగా ఆడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ బాగుంది. ఏ వేదికైనా విజయం తమదే అనే ధీమాతో ప్రతీ మ్యాచ్లో భారత్ చెలరేగిపోతుంది' అని అక్తర్ ప్రశంసించారు. మూడు వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్ బుధవారం హామిల్టన్ వేదికగా జరగనుంది.