
ఇదే మొదటి సారి కాదు
పాకిస్థాన్ జట్టు పట్ల ఆఫ్ఘనిస్థాన్ వ్యవహరిస్తున్న తీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవలు జరగడం ఇదే మొదటిసారి కాదని పేర్కొన్నాడు. చాలా మంది ఆసిఫ్ అలీ ప్రవర్తనపై కామెంట్లతో విరుచుకుపడుతుండగా.. అక్తర్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ తప్పుగా ప్రవర్తించాడని భావిస్తున్నట్లు చెప్పాడు. రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఆఫ్ఘన్ ఆటగాళ్ల ప్రవర్తన అస్సలు బాగుండడం లేదని పేర్కొన్నాడు. అలాగే భారత్, పాకిస్థాన్ జట్ల క్రికెటర్లు ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటారో చూస్తూనే ఉన్నారని, అలాంటి పరస్పర గౌరవ భావనతో మెలగాలంటూ హితవు పలికాడు.

ఇది అసలే కరెక్ట్ కాదు
'ఆఫ్ఘనిస్తాన్ మంచి క్రికెట్ ఆడుతోంది, నేను కాదనను. ఆఫ్ఘన్ చాలా మంచి జట్టు. కానీ ఆటను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మా పాక్ జట్టు భారత్తో కూడా ఇలా దూకుడుగా ఉండదు.. భారత్ కూడా మాతో స్నేహభావంతో ఉంటుంది. కానీ ఆఫ్ఘన్ మాత్రం ఇలా వ్యవహరిస్తోంది. ఆఫ్ఘనీలుగా మిమ్మల్ని మా బ్రదర్స్లాగా భావిస్తున్నాం, మీరు మా పొరుగు దేశానికి చెందిన ప్లేయర్లు. మేము మిమ్మల్ని లవింగ్గా ట్రీట్ చేస్తాం. కానీ మీరు మాత్రం ఇలాంటి చెత్త ప్రవర్తన చూపిస్తున్నారు. ఇది అసలు ఒప్పుకోని విషయం' అని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు.

చివర్లో విజయలాంఛనాన్ని ముగించిన నసీమ్ షా
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జడ్రాన్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 35), హజ్రతుల్లా జాజై(17 బంతుల్లో 4 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతర లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. ఇఫ్తికర్ అహ్మద్(33 బంతుల్లో 2 ఫోర్లతో 30), షాదాబ్ ఖాన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. నసీమ్ షా(4 బంతుల్లో 2 సిక్స్లతో 14 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్, మూడేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












