
కావాలనే బౌన్సర్లను సందించా:
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఇంటర్వ్యూలో క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్తో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... '2006లో పాకిస్థాన్ పర్యటనకు భారత జట్టు వచ్చింది. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్కి మోచేతి (టెన్నిస్ ఎల్బో) గాయం ఉందని నాకు తెలుసు. అందుకే ఆ టూర్లో అతడ్ని నియంత్రించేందుకు నేను అదేపనిగా బౌన్సర్లని సంధించాను. గాయం మళ్లీ తిరగబడుతుందేమోనని సచిన్ ఆ బౌన్సర్లని హుక్ లేదా ఫుల్ ఆడలేకపోయాడు. అలా సచిన్ను పరుగులు చేయనివ్వలేదు' అని నవ్వుతూ అన్నాడు.

గాయంతో ఇబ్బందులు:
సచిన్ 2004-05లోనే మోచేతి గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కెరీర్కి వీడ్కోలు చెపుతాడని అందరూ అనుకున్నారు. అయితే లిటిల్ మాస్టర్ మాత్రం గాయం నుంచి కోలుకుని మరో 8-9 సంవత్సరాలు పరుగుల వరద పారించాడు. ఇక 2006 పర్యటనకు ముందే షోయబ్ అక్తర్ బౌలింగ్ని సచిన్ టెండూల్కర్ ఉతికారేశాడు. 2003 వన్డే ప్రపంచకప్లో అక్తర్ విసిరిన బౌన్సర్ బంతిని అప్పర్ కట్ రూపంలో కళ్లుచెదిరే సిక్స్ బాదాడు. దీంతో క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ సచిన్ vs అక్తర్ అంటే ఆ సిక్సర్ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది.

సచిన్ కళ్లు మూసుకోవడాన్ని చూశా:
'మూడోదైన కరాచీ టెస్ట్ ప్రారంభంలోనే ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. దాంతో పాక్ ఒత్తిడిలో పడింది. అయితే కమ్రాన్ అక్మల్ సెంచరీతో చేయడంతో పాక్ కోలుకుంది. చివరకు మొదటి ఇన్నింగ్స్లో పాక్ 240 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం మేం బౌలింగ్ ఆరంబించాం. షోయబ్ అక్తర్ మెరుపు బౌన్సర్లని సంధించాడు. నేను స్క్వేర్ లెగ్లో అంపైర్కి సమీపంలో ఫీల్డింగ్ చేస్తుండగా.. అక్తర్ విసిరిన ఓ 2-3 బౌన్సర్లకి క్రీజులో ఉన్న సచిన్ కళ్లు మూసుకోవడాన్ని చూశాను. కొందరు బ్యాక్ఫుట్పై ఆడేందుకు ట్రై చేశారు కానీ.. మేము అవకాశం ఇవ్వలేదు' అని మహ్మద్ అసిఫ్ చెప్పాడు.

341 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం:
కరాచీ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 240 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం పాక్ బౌలింగ్ దాడికి పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ 238 పరుగులు మాత్రమే చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో పాక్ 599 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ తడబడింది. ఫలితంగా 341 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ను పాక్ 1-0తో గెలుచుకుంది. ముల్తాన్, ఫైసలాబాద్ టెస్టుల్లో పరుగుల వరద పారడంతో అవి 'డ్రా'గా ముగిసాయి.


Click it and Unblock the Notifications












