
లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నుంచి మ్యాచ్ విన్నింగ్ సెంచరీని ఆశిస్తున్నట్లు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆశించాడు. ఇకపోతే ఈ ఐపీఎల్ సీజన్లోని మొదటి 13మ్యాచ్లలో కోహ్లీ పేలవమైన ఫామ్ కనబరిచిన సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ.. ఆర్సీబీ ఈ సీజన్లో తన చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మీద గెలుపొందిన మ్యాచ్లో కోహ్లీ 73పరుగులు చేసి తన ఫాం అందుకున్నాడు. చూడచక్కని షాట్లతో మునుపటి తన ఇన్నింగ్స్ ద్వారా మునుపటి కోహ్లీని చూపించాడు. ఇక కోహ్లీకి తిరుగుండదు అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే కోహ్లీ రాణించాల్సిన అవసరముంది. ఎందుకంటే.. కోహ్లీ మంచి స్టాండింగ్ ఇస్తే మిగతా బ్యాటర్లకు కాస్త స్వేచ్ఛగా ఆడే వీలు కలుగుతుంది. ఇక ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ గురించి షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. కోహ్లీ తానేంటో చూపించాల్సిన గొప్ప క్షణం వచ్చిందన్నాడు.
'ఇక విరాట్ కోహ్లీ ఈ తరంలోనే అత్యుత్తమ ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతను కాస్త ఆడకపోతే చాలు నెట్టింట కొందరు అనవసరంగా ట్రోల్ చేస్తారు. అతని ఫామ్ పడిపోయింది అంటూ ట్రోలింగ్తో విరుచుకుపడతారు. క్రికెట్లో ఒకానొక దశలో ఇలాంటి వైఫల్యాలు ఎదురవుతాయని తెలుసుకోండి. ఇక కోహ్లీకి ముందు అత్యంత మంచి అవకాశం ఉంది. నేటి మ్యాచ్లో కోహ్లీ రాణించాలి. తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ ను బద్ధలుకొట్టేలాగా విరాట్ కోహ్లీ అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలి. నేను విరాట్ కోహ్లీకి మద్దుతిస్తున్నాను. విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని నా హృదయం కోరుకుంటోంది. ఇప్పటికే ఈ సీజన్లో చాలా పడిపోయాడు. విరాట్ ఇంకా పడిపోవడం నేను చూడలేను. నేను ఆశిస్తుందేంటంటే అతని నుంచి మ్యాచ్ విన్నింగ్ సెంచరీ రావాలని, ఆర్సీబీని ఫైనల్ కు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. విరాట్ ట్రోఫీ ద్వారా హ్యాపీ చెందాలని చూస్తున్నాను' అని అక్తర్ పేర్కొన్నాడు.