IND vs PAK: ఆసియా కప్ 2025 ఫైనలిస్ట్ జట్లు ఖరారయ్యాయి. చరిత్రలో తొలిసారిగా ఆసియా కప్ టైటిల్ పోరు దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. వర్చువల్ సెమీ-ఫైనల్లో పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్పై 11 పరుగుల తేడాతో అతి కష్టం మీద విజయం సాధించింది. భారత్ ఇప్పటికే సూపర్-4లో తొలి రెండు మ్యాచ్లలో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆ మైండ్సెట్ను బ్రేక్ చేయండి
ఆసియా కప్ 2025 గ్రూప్ దశ, సూపర్-4లో పాకిస్థాన్ భారత్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఫైనల్కు ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సల్మాన్ అలీ ఆఘా టీమ్కు కీలక సూచనలు ఇచ్చారు. భారత్ను ఎలా అడ్డుకోవచ్చో ఆయన ఓ పాకిస్తానీ ఛానెల్లో మాట్లాడుతూ వివరించారు. అక్తర్ మాట్లాడుతూ.. "ఆ మైండ్సెట్ నుంచి బయటపడండి, వారి (భారత్) హవాను వదిలివేయండి. వారి చుట్టూ ఉన్న ఆ ఆరా(Aura)ను ఛేదించుకుని లోపలికి వెళ్లండి. ఈరోజు ఉన్నట్టుగా.. 'రా, చూసుకుందాం (ఆ జావో దేఖ్ లెంగే)' అనే వైఖరితో వెళ్లండి. మీకు అలాంటి వైఖరి అవసరం" అని అన్నారు.

అభిషేక్ను రెండు ఓవర్లలో అవుట్ చేయండి..
భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఆరంభాన్ని ఇస్తున్న నేపథ్యంలో.. షోయబ్ అక్తర్ ప్రత్యేకంగా అతడి గురించి ప్రస్తావించారు. అతడిని 2 ఓవర్లలోపే ఔట్ చేయాలని అక్తర్ పాక్ జట్టుకు సలహా ఇచ్చారు. "దయచేసి గుర్తుంచుకోండి, 20 ఓవర్లు పూర్తి చేయకూడదు, మనం వికెట్లు తీయాలి. ఇండియాను ఔట్ చేయడానికి వెళ్తే, అప్పుడు ఇండియాకు కూడా అర్థమవుతుంది, ఇక్కడ మనం పోరాడి స్కోరు చేయాలని. ఒకవేళ అభిషేక్ మొదటి 2 ఓవర్లలో ఔట్ అయితే, వారికి కూడా కష్టాలు మొదలవుతాయి. వారు తీసుకుంటున్న ఈ మంచి ఆరంభానికి, అప్పుడు వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది" అని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 100 పరుగులు చేయడం కూడా కష్టమనిపించింది. కానీ బంగ్లాదేశ్ పేలవమైన ఫీల్డింగ్ కారణంగా పాకిస్తాన్ 135 పరుగులు చేయగలిగింది. దీనికి సమాధానికి బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. షమీమ్ హుస్సేన్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. ఫాస్ట్ బౌలర్లు షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సైమ్ ఆయుబ్ 2 వికెట్లు పడగొట్టాడు.