
పాకిస్థాన్ మాజీ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ల కోసం తాను ఎక్కడికైనా వెళ్తానని తెలిపాడు. ఆసియా కప్ ఫైనల్ దారులు ఇండియాకు దాదాపుగా మూసిపోయిన నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఫైనల్ జరిగే అవకాశం లేదు. అయితే గియితే శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ లేదంటే.. శ్రీలంక వర్సెస్ ఇండియా, లేదంటే శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఫైనల్ జరుగుతుంది తప్పా ఇండియా వర్సెస్ పాక్ అసాధ్యం.
ఈ నేపథ్యంలో అక్తర్ మాట్లాడుతూ.. 'ఆసియా కప్ ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఆడాలని నేను కోరుకున్నాను, అందుకోసం ఇప్పటికే టిక్కెట్లు కూడా కొనుక్కున్నాను. మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల అభిమానులతో ప్రత్యేకంగా సంభాషించాలనుకున్నాను. కానీ ఇప్పుడవేవీ జరగవు' అని షోయాబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. పాపం షోయబ్ అక్తర్ టికెట్ల డబ్బులు బొక్క అయ్యాయి.
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగే టీ20 ప్రపంచకప్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ తలపడనున్నాయి. అక్తర్ మెల్బోర్న్లోని ఐకానిక్ వేదికపై జరగబోయే మ్యాచ్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు చెప్పాడు. 'ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని చూడటానికి మెల్బోర్న్కు కూడా వెళ్తాను' అని అక్తర్ తెలిపాడు.
కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ తన నైపుణ్యాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని షోయాబ్ అక్తర్ పేర్కొన్నాడు. రోహిత్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 72పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అలాగే పాకిస్తాన్పై భారత్కు శుభారంభం అందేలా ధాటిగా ఆడాడు. అయినప్పటికీ ఆ రెండు మ్యాచ్లలో భారత్ ఓటమినే మూటగట్టుకుంది. ఇకపోతే టీమిండియా తమ తదుపరి మ్యాచ్ మహ్మద్ నబీ సారథ్యంలోని ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోతుంది. ఫైనల్ చేరాలంటే ఇండియా ఆ మ్యాచ్ భారీ తేడాతో గెలవాలి. పాకిస్థాన్ మీద శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ గెలవాలి.
అప్పుడే ఇండియాకు అవకాశాలుంటాయి. లేదంటే.. టీమిండియా అవకాశాలు గల్లంతైనట్లే. నేడు బుధవారం షార్జాలో పాకిస్తాన్ వర్సెస్ ఆప్ఘనిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇటీవల ఆప్ఘనిస్థాన్ టాప్ జట్టుగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. గ్రూపు స్టేజులో లంకకు, బంగ్లాకు షాకిచ్చి టేబుల్ టాపర్గా నిలిచి సూపర్ 4 దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే సూపర్ 4 స్టేజులో మాత్రం ఆ జట్టు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పూర్తిగా తడబడింది. ఇక ఆప్ఘనిస్థాన్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ ఆఫ్ఘన్ తప్పనిసరిగా గెలవాలి. నేటి మ్యాచ్లో భారత అభిమానులు ఆఫ్ఘన్ అభిమానులుగా మారబోతున్నారు.