భారత్-పాకిస్థాన్ క్రికెట్ పోరు అంటే కేవలం మైదానంలో ఆట మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం, ఒక యుద్ధం. అప్పట్లో 90వ దశకంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్, సక్లైన్ ముస్తాక్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ బౌలర్లు భారత్ను వణికించేవారు.ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ను అవుట్ చేయడం అంటే వారికి అదొక గౌరవం, ఒక పెద్ద పందెం.ఆనాటి పంతాలు,పంతాల వెనుక ఉన్న నొప్పిని రావల్పిండి ఎక్స్ప్రెస్ తాజాగా బయటపెట్టింది.అప్పట్లో సచిన్ టెండూల్కర్ వర్సెస్ షోయబ్ అక్తర్ మధ్య సాగిన పోరాటం నేటికీ అభిమానుల గుండెల్లో సజీవంగా ఉంది.

ఇండియా -పాకిస్థాన్ మధ్య 1999 కోల్కతా టెస్టును క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్లోనే అప్పటికి పెద్దగా తెలియని పాకిస్తాన్ యువ పేసర్ షోయబ్ అక్తర్ భారత దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్లను వరుస బంతుల్లో క్లీన్బౌల్డ్ చేశాడు.అక్తర్ సంధించిన పర్ఫెక్ట్ యార్కర్లకు ఈ దిగ్గజ క్రికెటర్లు పెవీలియన్ బాట పట్టడంతో ఒక్కసారిగా ఈడెన్ గార్డెన్స్ నిశబ్ధమైపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్తర్ మాట్లాడుతూ.. 1998-99 నాటి పాక్ భారత పర్యటనను గుర్తు చేసుకున్నాడు. ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడించాడు."ఆ సిరీస్లో సచిన్ వికెట్ కోసం నాకు,సక్లైన్ ముస్తాక్కు మధ్య పెద్ద పందెం నడిచేది. 'సచిన్ను నేనే అవుట్ చేస్తా'అని అతను,'లేదు ఈసారి నా వంతు'అని నేను సవాళ్లు విసురుకునేవాళ్లం"అని అక్తర్ పేర్కొన్నాడు.


కానీ ఆ పోరాటం వెనుక భయంకరమైన శారీరక నొప్పి ఉంది."మా ఇద్దరి మోకాళ్లు దెబ్బతిన్నాయి.నా మోకాళ్లలో వాపు వచ్చి నీరు చేరింది.కానీ మేం ఆ నొప్పిని భరిస్తూనే రహస్యంగా మందులు ఇంజెక్షన్లు తీసుకుని మైదానంలోకి దిగేవాళ్లం.మా సీనియర్లకు గనుక మా పరిస్థితి తెలిస్తే..జట్టులో నుంచి గెంటేసేవారు.కేవలం సచిన్ వికెట్ తీయాలన్న కసితోనే ఆ గొడ్డలి పెట్టు వంటి నొప్పులను భరించాం" అంటూ అక్తర్ ఆనాటి తీవ్రతను వివరించాడు.
🚨BIG ADMISSION OF DOPING BY SHOAIB AKHTAR ON LIVE TV
— Brutal Truth (@sarkarstix) February 24, 2026
"Saqlain and I had a bet on who would get Sachin’s wicket during Pakistan's 1998–99 India tour. Both our knees had given up on us. We were secretly taking banned pills and injections just to keep ourselves going." pic.twitter.com/qVo5I6Vk0Y
కాలం మారింది.. కానీ పాకిస్థాన్ క్రికెట్ కష్టాలు మాత్రం మారలేదు. తాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్, తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లోనూ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఈ ఓటమితో సెమీస్ ఆశలు గాల్లో దీపంలా మారడంతో షోయబ్ అక్తర్ లైవ్ టీవీలోనే తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.మ్యాచ్కు ముందు "ఇంగ్లాండ్ దారుణంగా ఆడాలని, భారత్ టోర్నీ నుంచి తప్పుకోవాలని" ఆకాంక్షించిన అక్తర్, ఫలితం తారుమారు కావడంతో తట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాపై నిప్పులు చెరిగాడు. "ఇతడు అసలు కెప్టెన్సీ మెటీరియలే కాదు. పాక్ జట్టును నడిపించే సత్తా ఇతనికి లేదు" అంటూ గతంలో తను చేసిన మద్దతు వ్యాఖ్యలపైనే యూ-టర్న్ తీసుకున్నాడు.