హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెల్లడికానప్పటికీ సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఐసీసీ, బీసీసీఐ తీవ్ర ఒత్తిడి చేయడంతో రెండు షరతులతో పీసీబీ హైబ్రిడ్ పద్ధతికి అంగీకరించింది.
హైబ్రిడ్ మోడల్ కారణంగా తమ ఆదాయానికి గండి పడుతుందని, కాబట్టి ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూను అధిక మొత్తంలో పెంచాలని పీసీబీ షరతు పెట్టింది. అంతేగాక 2031 వరకు భారత్లో జరిగే ఐసీసీ ఈవెంట్స్ను కూడా హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని, తమ జట్టును ఇండియాకు పంపించమని మరో షరతు తెలిపింది. ఈ క్రమంలో డబ్బు కోసమే ఆదిలోనే హైబ్రిడ్ మోడల్కు అంగీకరించలేదని పాక్ బోర్డుపై విమర్శలు వస్తున్నాయి.

అయితే ఈ విమర్శల నేపథ్యంలో పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డబ్బును డిమాండ్ చేయడం సరైన నిర్ణయమే అని అక్తర్ పేర్కొన్నాడు. కానీ రెండో షరతుతో అక్తర్ ఏకీభవించలేదు. భారత్కు తమ జట్టు వెళ్లాలని, సొంతగడ్డపై టీమిండియాను ఓడించి.. ఆ విజయాన్ని ఆస్వాదించాలని అక్తర్ అన్నాడు.
''ఆతిథ్య హక్కులతో రాబడి పొందుతున్నారు. రెవెన్యూ కోసం ఆ డిమాండ్ చేశారని అర్థం చేసుకోవచ్చు. పాక్ బోర్డు నిర్ణయం సరైనదే. ఇదే తరహాలో బలంగా కొనసాగాలి. ఛాంపియన్స్ ట్రోఫీని మన దేశంలో నిర్వహించి, వాళ్లు రావడానికి ఇష్టపడకపోతే.. ఎక్కువ మొత్తంలో రెవెన్యూని పంచి ఇవ్వాలి. ఇది మంచి నిర్ణయం. అయితే భవిష్యత్లో భారత్లో ఆడే విషయంలో స్నేహపూర్వకంగా ఆలోచించాలి. భారత్కు వెళ్లి, సొంతగడ్డపై వాళ్లను ఓడించాలని భావిస్తున్నాను'' అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు. మరోవైపు ఇండియాకు పాకిస్థాన్ వస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ కోసం పాక్ వచ్చింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ దేశానికి టీమిండియా రాకపోవడంతో.. 2031 వరకు భారత్లో జరిగే ఐసీసీ ఈవెంట్స్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పాక్ ఈసారి డిమాండ్ చేస్తోంది.
మరో ఆరేళ్లలో భారత్ అయిదు మెగాటోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్, మెన్స్ ఆసియా కప్నకు; 2026లో శ్రీలంకతో సంయుక్తంగా మెన్స్ టీ20 వరల్డ్ కప్కు; 2029లో మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ; 2031లో బంగ్లాదేశ్తో కలిసి వన్డే వరల్డ్ కప్కు ఇండియా ఆతిథ్యంఇవ్వనుంది.