ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ ఓటమి తర్వాత ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. గ్రూప్ దశలో, సూపర్-4లో ఇప్పటికే భారత్ చేతిలో పాక్ ఓడిపోయింది. ఫైనల్లో పాకిస్తాన్ కొంతవరకు గట్టి పోటీ ఇచ్చినా.. చివరికి భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీమ్ మేనేజ్మెంట్పై షోయబ్ అక్తర్ ఫైర్
పాక్ ఓటమి తర్వాత మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. "దురదృష్టవశాత్తూ, ఇది జట్టు సమస్య కాదు. మిడిల్ ఆర్డర్ సమస్య అనేది సరైన ఆటగాళ్లను ఎంపిక చేయని మేనేజ్మెంట్ చేసిన తప్పు. నేను చెప్పాలంటే, ఇది అర్థరహితమైన కోచింగ్. ఇలాంటి పదాలు వాడినందుకు క్షమించండి, కానీ ఇది అర్థరహితమైన కోచింగ్. మా మ్యాచ్ విన్నర్స్ అయిన హసన్ నవాజ్, సల్మాన్ మీర్జా లాంటి వాళ్లు ఉన్నారు. పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. మేము చాలా నిరాశ చెందాం" అని అన్నారు.

మాట్లాడటానికి మాటలు దొరకక తడబాటు
తన అభిప్రాయాలను ఎప్పుడైనా నిర్భయంగా చెప్పే షోయబ్ అక్తర్.. పాకిస్తాన్ ఓటమి తర్వాత సరిగా మాట్లాడలేకపోయారు. ఆయన స్వరం తడబడింది. ఓ విషయాన్ని పూర్తిగా చెప్పకముందే మరో విషయం గురించి మాట్లాడటం ప్రారంభించారు. అక్తర్ ఇంకా మాట్లాడుతూ.. "ఇది సూపర్ సండే, దేశమంతా చూస్తోంది. మా మిడిల్ ఆర్డర్లో ముందు నుంచే సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరూ ఇదే చెబుతున్నారు" అని తన నిరాశను వ్యక్తపరిచారు.
బ్యాటింగ్, బౌలింగ్లో భారత్ అద్భుతమైన కమ్బ్యాక్
మొదట కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి పాకిస్తాన్ను 19.1 ఓవర్లలో 146 పరుగులకే పరిమితం చేశారు. ఒకానొక సమయంలో పాకిస్తాన్ స్కోరు ఒక వికెట్కు 113 పరుగులుగా ఉన్నప్పుడు.. అది 180 పరుగులు దాటుతుందని భావించారు. ఆ తర్వాత, భారత్ బ్యాటింగ్లో కూడా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత తిలక్ వర్మ అజేయమైన అర్ధ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆయన సంజూ శాంసన్తో కలిసి 57 పరుగులు, శివమ్ దూబేతో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.