లాహోర్: ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్ టైటిల్ను భారత క్రికెట్ జట్టు ఎగరేసుకెళ్తుందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ జోస్యం చెప్పారు. ఈ సారి కప్ను కోహ్లీసేన సగర్వంగా ఎత్తుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం తన సొంత యూట్యూబ్ ఛానల్లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మంగళవారం మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ను ఓడిస్తుందని అన్నారు. న్యూజిలాండ్ క్రికెటర్లు ఒత్తిడికి తట్టుకోలేరని చెప్పారు. బౌలింగ్లోను, బ్యాటింగ్లోనూ ప్రత్యర్థిపై ఒత్తిడిని తీసుకుని రావడంలో టీమిండియాకు తిరుగులేదని అఖ్తర్ స్పష్టం చేశారు.
ప్రపంచకప్ ఆసియా ఖండాన్ని దాటి బయటి దేశాలకు వెళ్లకూడదని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో- ఈ నెల 14వ తేదీన లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ప్రత్యర్థిని మట్టి కరిపిస్తుందని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. న్యూజిలాండ్తో పోల్చుకుంటే పాకిస్తాన్ అద్భుతంగా ఆడిందని ఆయన కితాబిచ్చారు. రన్ రేట్ వ్యవస్థ వల్లే పాకిస్తాన్ జట్టు ఓటమి పాలైందని చెప్పుకొచ్చారు. రన్ రేట్ను లెక్కించే విధానాల్లో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. క్రూరంగా రన్రేట్ను లెక్కిస్తున్నారని అన్నారు.