హైదరాబాద్: క్రికెట్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు క్రికెట్లో అన్నదమ్ములు కలిసి ఒకే మ్యాచ్లో ఆడిన సందర్భాలు చూశాం. కానీ తండ్రీ కొడుకులు కలిసి ఒక అధికారిక క్రికెట్ మ్యాచ్లో కలిసి ఆడిన సందర్భం మాత్రం క్రికెట్ చరిత్రలో దాదాపుగా లేవనే చెప్పాలి.
అయితే వెస్టిండిస్ దేశవాళీ క్రికెట్లో మాత్రం ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మన్ శివనారాయణ్ చందర్పాల్ తన కుమారుడు త్యాగి నారాయణ్తో కలిసి కరీబియన్ ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడటం విశేషం. సబీనా పార్క్ వేదికగా నిర్వహిస్తున్న డబ్ల్యూఐసీబీ ఫ్రొఫెషనల్ క్రికెట్ లీగ్లో వీళ్లిద్దరూ కలిసి గయానా తరఫున మ్యాచ్ ఆడారు.
జమైకాతో జరిగిన ఈ మ్యాచ్లో తండ్రీకొడుకులిద్దరూ అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఓపెనర్గా దిగిన త్యాగ్నారాయణ్ 58 పరుగులు చేస్తే, ఐదో స్థానంలో వచ్చిన శివ్నారాయణ్ 57 పరుగులు సాధించాడు. నాలుగో వికెట్కు వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యంతో గయానా జట్టు 262 పరుగులు చేసింది.
అంతకుముందు గయానా తరఫున 20 ఏళ్ల త్యాగితో కలిసి చందర్పాల్ ఎన్నో మ్యాచ్లు ఆడాడు. 42 ఏళ్ల చందర్పాల్ విండీస్ తరఫున 164 టెస్ట్ల్లో 11,867 పరుగులు చేశాడు. తద్వారా వెస్టిండిస్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు.