కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్మన్
తాజాగా చంద్రపాల్ మాట్లాడుతూ... 'ప్రపంచంలో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్మన్. అతడు ఆటలో అన్ని కోణాలపై దృష్టిసారిస్తాడు. దాని ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాం. మైదానం అంతటా పరుగులు చేస్తాడు. కోహ్లీ ఫిట్నెస్ కోసం ఎంతో శ్రమిస్తాడు. అంతేకాక తన నైపుణ్యం మరింత పెంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. కఠోర శ్రమ ఫలితాలను ఇస్తుందని అతడు నిరూపిస్తున్నాడు' అని అన్నారు.
అన్నిసార్లు టాప్లో ఉండటం సాధ్యం:
'అద్భుతంగా రాణించాలని బరిలోకి దిగే ఆటగాళ్లో విరాట్ కోహ్లీ ఒకరు. ఎన్నో గొప్ప ప్రదర్శనలతో తన సత్తా ఏంటో చాటి చెబుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో పరుగులు చేస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుండి పరుగు చేస్తూనే ఉన్నాడు. ఆటలో అన్నిసార్లు టాప్లో ఉండటం సాధ్యం కాదు. కానీ.. కోహ్లీ సాధ్యమేనని నిరూపిస్తున్నాడు. అతని దూకుడే రాణించేలా చేస్తోంది. కెప్టెన్గా కూడా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు' అని చంద్రపాల్ పేర్కొన్నారు. విండీస్ తరఫున చంద్రపాల్ 164 టెస్టులు, 268 వన్డేలు, 22 టీ20లు ఆడారు.
అన్ని ఫార్మాట్లలో కలిపి 70 శతకాలు:
భారత్ తరఫున విరాట్ కోహ్లీ 86 టెస్టులు, 248 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 7,240, వన్డేల్లో 11,867, టీ20ల్లో 2,794 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 70 శతకాలు సాధించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగల సామర్థ్యం ఒక్క కోహ్లీకి మాత్రమే ఉందని ఇప్పటికే ఎందరో మాజీలు చూపిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోహ్లీ ఎందరో దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు.
నాకు కోహ్లీ అంటే ఇష్టం:
'భారత జట్టులో అత్యుత్తమ ఆటగాడు ఎవరని నన్ను కొందరు ప్రశ్నించారు. అప్పుడు నేను కోహ్లీ పేరే చెప్పాను. నేను కొత్తగా అతని గురించి వివరించాల్సిందేమీ లేదు. అతని ప్రదర్శన, గణాంకాలు చూస్తే ఎవరైనా అంగీకరించాల్సిందే. దక్షిణాఫ్రికాలో అనూహ్యంగా స్పందించిన పిచ్పై కూడా సెంచరీ చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే భయపడతాడని, బౌన్సీ పిచ్లపై ఆడలేడని, స్పిన్ను ఎదుర్కోలేడని ఇలా ఏ విషయంలోనైనా కోహ్లీ గురించి ఎవరూ ప్రశ్నించలేదు. అతని సత్తా ఏమిటో అందరికీ తెలుసు. కోహ్లీ చూడచక్కగా ఆడతాడు. అతని బ్యాటింగ్ను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది' అని పాక్ దిగ్గజం జావేద్ మియాందాద్ అన్నారు.