మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అయితే ఈ మెగా ఆక్షన్కు సంబంధించిన రూల్స్ను బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు. బీసీసీఐ ఇచ్చే నిబంధనలతోనే రిటైన్డ్ ప్లేయర్ల జాబితా, రైట్ టూ మ్యాచ్ కార్డ్ వంటి వాటికి స్పష్టత లభిస్తుంది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై కూడా బీసీసీఐ క్లారిటీ ఇవ్వనుంది. ఈ రూల్ను స్టార్ ఆటగాళ్లతో సహా మాజీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఆల్రౌండర్లను ప్రోత్సహించకుండా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అడ్డుపడుతుందని ప్రధాన వాదన. అయితే ఈ రూల్కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతు ఇచ్చాడు. ఈ నిబంధన ఐపీఎల్లో వ్యూహాత్మక అంశాన్ని తీసుకొచ్చిందని, తొలగిస్తే అది పోతుందని అన్నాడు. భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ యూట్యూబ్ షోలో అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

''ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ఎందుకు వ్యతిరేకించట్లేదంటే.. ఇది వ్యూహాత్మక అంశాన్ని తీసుకువచ్చింది. అయితే మరోవైపు వాదన ఏంటంటే..ఆల్రౌండర్లను ఇది ప్రోత్సహించట్లేదని. కానీ వాళ్లను ఎవరూ ఆపట్లేదు. ఈ జనరేషన్లో ఎవరూ ఆల్రౌండ్ పాత్రలు ఎక్కువగా చేయట్లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వాళ్లను ఏం నిరుత్సాహపరచట్లేదు. వెంకటేశ్ అయ్యర్ను చూడండి.. లంకషైర్ తరఫున ఆడుతున్నాడు. కాబట్టి ఆవిష్కరణకు అవకాశం ఉంది. ఇది ఆటను అందంగా చేస్తుంది''
''క్వాలిఫయిర్-2లో షాబాజ్ అహ్మదాబాద్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకువచ్చింది. అతను మ్యాచ్ విన్నర్గా (3/23) నిలిచాడు. మంచు ప్రభావంతో మ్యాచ్లు ఏకపక్షంగా మారే సందర్భాల్లో.. ఛేజింగ్ చేసే జట్టు బ్యాటర్లకు కౌంటర్ ఇవ్వడానికి బౌలింగ్ చేసే జట్టుకు ఎక్సట్రా ఆప్షన్ దక్కుతుంది. ఇక కొన్ని మైదానాల్లో మినహా భారీ స్కోర్లు నమోదుకాలేదు. పంజాబ్ కింగ్స్ సొంత మైదానంలో 160-170 స్కోరే నమోదైంది'' అని అశ్విన్ అన్నాడు.

ఈ నిబంధనతో దూబె, ధ్రువ్ జురెల్ వంటి ప్లేయర్లు అవకాశాలు దక్కించుకుని భారత జట్టులోకి కూడా వచ్చారని అశ్విన్ తెలిపాడు. ''ఇక షాబాజ్ అహ్మద్, శివమ్ దూబె, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకపోతే అంతగా అవకాశాలు వచ్చేవి కావు. చాలా మంది ఆటగాళ్లకు ఇది అవకాశం కల్పిస్తుంది. అయితే అలా జరగడానికి ఇదే ఏకైక మార్గం అని చెప్పట్లేదు. కానీ ఈ రూల్ అంత చెడ్డది కాదని నా అభిప్రాయం'' అని అశ్విన్ పేర్కొన్నాడు.