టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్యతో విడిపోయినప్పటి నుంచి కొడుకును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన కొడుకుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా మరోసారి తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
"నా కొడుక్కి ఇప్పుడు 11 ఏళ్లు వచ్చాయి. కానీ నేను అతడితో రెండున్నార ఏళ్లు మాత్రమే ఉన్నాను. నేను అతడిని చూసి రెండేళ్లు అయిపోయింది. మాట్లాడి ఏడాది అయిపోయింది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి నన్ను బ్లాక్ చేసేశారు. అతడిని కలిస్తే ముందుగా హగ్ చేసుకుంటాను. అతడు లేకుండా గడపడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ అతడు లేకుండా జీవించడం నేర్చుకోవాలి కదా. నేను అతడిని చాలా మిస్ అవుతాను. కానీ నేను అతడితో ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యే ఉంటాను. మాట్లాడుతూనే ఉంటాను. నేను రోజు అతడితో మాట్లాడుతున్నట్లు, కౌగిలించుకున్నట్లు ఫీల్ కూడా అవుతాను. ఆధ్యాత్మికంగా నా శక్తిని, ఆశీర్వాదాలను అతడికి ఇస్తాను. ఒకవేళ నా కొడుకును వెనక్కి రప్పించాలనుకుంటే నాకున్న దారి ఇదొక్కటే. బాధపడటం వల్ల ఏమీ జరగదు. అతడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాను. నన్ను అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసినప్పటికీ.. ఇప్పటికీ అతడు మూడు నాలుగు రోజులకొకసారి మెసేజ్ చేస్తూనే ఉంటాను. అతడు వాటిని చదవాలని నేను ఆశించను. అతడు చదవకపోయినా నేను ఏమీ అనుకోను. కానీ అతడిని కలిసేందుకు ప్రయత్నించడం నా బాధ్యత. నేనెప్పుడు ఇది చేస్తూనే ఉంటాను." అని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా - ధావన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడున్నారు. అయితే 2023లో మనస్పర్థలు రావడంతో ధావన్ - అయేషా ముఖర్జీకి విడాకులయ్యాయి. అప్పటికి రెండేళ్ల క్రితమే తాము విడిపోతున్నట్టు ధావన్ దంపతులు ప్రకటించారు.