ప్రపంచ క్రికెట్లోనే శిఖర్ ధావన్ టాప్ బ్యాటర్ స్థాయికి చేరి ఎన్నో ఘనతలు సాధించాడు. ఐసీసీ టోర్నమెంట్స్లోపరుగులు వరద పారించి రికార్డులు సృష్టించాడు. కానీ ప్రస్తుతం ధావన్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. టీమిండియాకు అతడు దూరమై దాదాపు ఏడాది దాటింది. అయితే కెరీర్ పరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ధావన్ కష్టకాలంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ధావన్ తన కొడుకు జొరావర్ కోసం చేసిన ఓ పోస్ట్ అందర్నీ కంటతడి పెట్టిస్తుంది.
ఇటీవల ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయిన సంగతి తెలిసిందే. తనను ఆయేషా మానసికంగా వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాలని ధావన్ కోర్టు మెట్లెక్కాడు. విచారణ జరిపిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీని కోరిన ధావన్ అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. కానీ ఫోన్లో మాట్లాడొచ్చని, స్కూల్ సెలవుల సమయంలో తన కుమారుడితో భారత్లో కలిసి ఉండవచ్చని చెప్పింది. దానికి తగ్గట్టుగా అయేషా సహకరించాలని తెలిపింది.

కానీ, గత మూడు నెలలుగా తన కుమారుడు జొరావర్తో మాట్లాడట్లేదని, ఇవాళ జొరావర్ బర్త్డే అని శుభాకాంక్షలు తెలుపుతూ శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ''నేరుగా నిన్ను చూసి ఏడాది దాటింది. కాంటాక్ట్ లేకుండా దాదాపు మూడు నెలల గడిచాయి. ప్రతి చోట నన్ను బ్లాక్ చేశారు. అందుకే పాత ఫొటోతో నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా''
''నేరుగా కనెక్ట్ అవ్వలేకపోయినా, టెలిపతితో అందుబాటులో ఉంటా. నీ గురించి ఎంతో గర్వపడుతున్నా. నువ్వుగా గొప్పగా రాణిస్తున్నావని, మంచిగా ఎదుగుతున్నావని నాకు తెలుసు. నాన్న ఎప్పుడూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడి దయతో మనం మళ్లీ కలిసే వరకు నవ్వుతూ పాజిటివ్గానే ఉంటాడు. నువ్వు దయగా, వినయంగా, సహనంతో బలంగా ఉండు. మిమ్మల్ని చూడనప్పటికీ ప్రతి రోజు మీ గురించే ఆలోచిస్తుంటా'' అని ఇన్స్టాగ్రామ్లో ధావన్ రాసుకొచ్చాడు.