
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కష్టాలు
ఐపీఎల్ ఆరంభం నుంచి కాగితంపై బలంగా కనిపించే పంజాబ్ జట్టు కప్పు మాత్రం కొట్టలేకపోయింది. ఆరంభంలో ఈ జట్టుకు యువరాజ్ సింగ్ సారధ్యం వహించాడు. రెండేళ్ల క్రితం జట్టు పేరును 'కింగ్స్ XI పంజాబ్' నుంచి 'పంజాబ్ కింగ్స్'గా మార్చిన యాజమాన్యం.. సారధిగా సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ను నియమించింది. కానీ ఆ జట్టు రాత మారలేదు. అయితే ఎలాగైనా రాహుల్ సారధ్యంలోనే కప్పు కొడతామని ఆ జట్టు నమ్మింది. అతనికి మద్దతుగా నిలిచింది. కానీ గతేడాది కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. రాహుల్తో ఒప్పందం చేసుకొని ఎత్తుకెళ్లిపోయింది. దీంతో పంజాబ్ జట్టులో కెప్టెన్ పొజిషన్ ఖాళీ అయింది.

మయాంక్కు ఓటేసిన మేనేజ్మెంట్..
రాహుల్ సడెన్గా వెళ్లిపోవడంతో జట్టు సారధ్య బాధ్యతలను ఎవరికి ఇవ్వాలి? అనేది పంజాబ్ జట్టు మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరైనా కొత్త వారిని కొనుగోలు చేసి, వారిని కెప్టెన్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించింది. అయితే జట్టుతో ఎప్పటి నుంచో కలిసి ఉన్న మయాంక్ అగర్వాల్ కూడా ఈ స్థానంపై ఆసక్తి కనబరచడంతో.. వేరే చోట ఎందుకు వెతకాలని అనుకుంది. ఈ క్రమంలోనే మయాంక్ను జట్టు కెప్టెన్గా నియమించింది. అయితే దీని ప్రభావం అతని బ్యాటింగ్పై పడింది. 2021 ఐపీఎల్ సీజన్లో కెప్టెన్గా 13 మ్యాచులు ఆడిన మయాంక్.. 16.33 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతనిపై కెప్టెన్సీ భారం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

గబ్బర్ ఎంట్రీ..
ఐపీఎల్లో నిలకడగా రాణించే ఆటగాళ్లలో ఒకడైన శిఖర్ ధవన్పై మెగా ఆక్షన్ ముందే పంజాబ్ జట్టు కన్నేసింది. రాహుల్ స్థానంలో అతన్నే కెప్టెన్ చేయాలని అనుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అందుకే వేలంలో అందరి కన్నా ముందే గబ్బర్ కోసం పోటీ పడి గెలుచుకుంది. వేలానికి ముందు కేవలం మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్ను మాత్రమే అట్టిపెట్టుకున్న టీం మేనేజ్మెంట్.. వేలంలో కొనుగోలు చేసిన మొదటి ప్లేయర్ ధవనే కావడం గమనార్హం. అతని కోసం రూ.8.25 కోట్లు ఖర్చు చేసింది పంజాబ్ యాజమాన్యం.
కలిసొచ్చిన కెప్టెన్సీ అనుభవం..
అయితే అగర్వాల్ను కెప్టెన్ చేయడంతో కేవలం ఓపెనర్గా మాత్రమే ఆడిన ధవన్.. ఈ ఏడాది బాగానే రాణించాడు. మయాంక్తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు మోసిన ధవన్.. 14 మ్యాచుల్లో 38.38 సగటుతో 460 పరుగులు చేశాడు. అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం ధవన్కు ఉంది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్ కూడా ధవన్కే ఓటేశాడు. దీంతో వచ్చే ఏడాది నుంచి జట్టుకు గబ్బరే నాయకుడని పంజాబ్ కింగ్స్ ప్రకటించింది. మరి మయాంక్ను జట్టు వదులుకుందా? లేక ఓపెనర్గానే కొనసాగుతాడా? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications












