ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా నాలుగో నెంబర్లో ఎవరు ఆడతారనేది పెద్ద ప్రశ్నగా మారింది. శ్రేయాస్ అయ్యర్ కనుక వరల్డ్ కప్ టైంకి కోలుకోకపోతే.. ఆ స్థానంలో ఎవరిని ఆడించాలని సెలెక్టర్లు తలలు బాదుకుంటున్నారు. ఈ సమస్యపై టీమిండియా వెటరన్ శిఖర్ ధవన్ స్పందించాడు.
తానైతే నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను ఆడిస్తానని చెప్పాడు. సూర్యకు మంచి అనుభవం ఉందని, కాబట్టి అతనే ఈ స్థానంలో మంచి ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్ల గాయాల వల్ల నాలుగో నెంబర్లో ఆడే ప్లేయర్ను డిసైడ్ చేయడంలో టీమిండియా సతమతం అవుతోంది.

సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దర్నీ ఈ స్థానంలో టీమిండియా ప్రయత్నించింది. తాజాగా ఈ స్థానంలో తిలక్ వర్మను ఆడించాలని అశ్విన్ వంటి వాళ్లు కూడా సూచిస్తున్నారు. ఈ క్రమంలో శిఖర్ ధవన్ ఈ సమస్యపై మాట్లాడుతూ.. 'నేనైతే నాలుగో నెంబర్లో సూర్యను తీసుకుంటా. తను కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. మంచి అనుభవం ఉన్న ప్లేయర్' అని చెప్పాడు.
అయితే వన్డేల్లో సూర్య రికార్డు చాలా చెత్తగా ఉంది. తనకు వచ్చిన అవకాశాలను అతను ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు 26 వన్డేలు ఆడిన అతను కేవలం 24.33 సగటుతో 511 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విండీస్తో మూడో టీ20 తర్వాత మీడియాతో మాట్లాడిన సూర్య.. తన వన్డే రికార్డు ఏమాత్రం బాగలేదని ఒప్పుకున్నాడు కూడా.
అలాగే వరల్డ్ కప్లో శుభ్మన్ గిల్ ఎలా ఆడతాడో అని ఎదురు చూస్తున్నట్లు ధవన్ చెప్పాడు. 'ఈ వరల్డ్ కప్లో గిల్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూసేందుకు ఎదురు చూస్తున్నా. రోహిత్ శర్మ ఆట చూసేందుకు కూడా ఎగ్జయిట్ అవుతున్నా. లాస్ట్ వరల్డ్ కప్లో రోహిత్ చెలరరేగాడు కదా' అని ధవన్ చెప్పుకొచ్చాడు.