
హైదరాబాద్: సఫారీ గడ్డపై రెండో వన్డేలో భారత మణికట్టు స్పిన్నర్ చాహల్ సంచలనాత్మక బౌలింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. తానొక్కడే ఐదు వికెట్లను తీసి ఔరా అనిపించాడు. దీంతో చాహల్ను తోటి క్రీడాకారులు పలు రకాలుగా అభినందనలు తెలుపుతున్నారు. శిఖర్ ధావన్ అయితే చాహల్ను డైనమేట్తో పోలుస్తున్నాడు.
సెంచూరియన్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో చాహల్ (5/22) ధాటికి సఫారీ బ్యాట్స్మెన్ 118 పరుగులకే పేలవ రీతిలో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. స్పిన్ ఆడటంలో మంచి గుర్తింపున్న డికాక్, డుమిని సైతం చాహల్ విసిరిన ప్లైటెడ్ డెలివరీలని ఎదుర్కోలేక వికెట్లని సమర్పించుకున్నారు. దక్షిణాఫ్రికాలో అదీ సఫారీ జట్టుపై ఓ స్పిన్నర్ 5/22 తరహాలో మెరవడం ఇదే తొలిసారి.
సఫారీలను ముప్పుతిప్పలు పెట్టిన చాహల్పై ప్రశంసల జల్లు కురుస్తుండగా.. మ్యాచ్ అనంతరం ఈ మణికట్టు స్పిన్నర్తో కలిసి దిగిన ఫొటోని ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'చాహల్ చూసేందుకు చిన్నోడే కానీ.. పెద్ద బాంబ్. రెండో వన్డేలో చాలా గొప్పగా బౌలింగ్ చేశావ్' అని ధావన్ రాసుకొచ్చాడు. ఈ మ్యాచ్లో లక్ష్యాన్ని భారత్ 20.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఛేదించగా.. చాహల్కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' దక్కింది.
రెండో వన్డేలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
* సఫారీ గడ్డపై స్పిన్నర్గా చాహల్ రెండో అత్యుత్తమ(5/22) ప్రదర్శన నమోదు చేశాడు. 1999లో సునీల్ జోషి (5/6) ప్రదర్శన మొదటి స్థానంలో ఉంది. కేప్టౌన్ (2002)లో నికీ బోయే(5/21) ఇప్పటివరకు అత్యుత్తమం.
* సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు 118. 2009లో ఇంగ్లాండ్పై 119 పరుగులకు ఆలౌటైంది. మొత్తంగా వన్డేల్లో సఫారీలకు ఇది ఎనిమిదో స్వల్ప స్కోరు.
* డివిలీయర్స్, డుప్లెసిస్ లేకుండా దక్షిణాఫ్రికా వన్డేల్లో బరిలోకి దిగడం 2009 తర్వాత ఇదే తొలిసారి.
* ఆసియా బయట భారత స్పిన్నర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో చాహల్, కుల్దీప్ ఎనిమిది వికెట్లు తీశారు.
* వన్డేల్లో ప్రస్తుతం టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఈ సిరిస్ను గెలిస్తే నెంబర్వన్ ర్యాంక్ నిలుస్తుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.