హైదరాబాద్: అమ్మ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. అంతేకాదు తన తల్లితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'అమ్మ కోలుకుంది. ఆమె ఆరోగ్యం గతంలో కంటే మెరుగుపడింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని ధావన్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం ధావన్ శ్రీలంక పర్యటనలో ఉన్న సమయంలో తల్లి సునయన అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. దీంతో విషయం తెలిసిన ధావన్ వెంటనే భారత్ చేరుకున్నాడు. ప్రస్తుతం తన తల్లి కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం కుదుటపడిందని ఫ్యాన్స్కు ట్విట్టర్లో తెలిపాడు.
ఇదిలా ఉంటే శ్రీలంక పర్యటనలో శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మూడు టెస్టుల్లో 89.50 యావరేజితో మొత్తం 358 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం కైవసం చేసుకున్నాడు. ఇక, నాలుగు వన్డేల్లో 190 పరుగులు సాధించాడు.
శ్రీలంకతో గత ఆదివారం జరిగిన చివరి వన్డేతో పాటు బుధవారం జరగనున్న ఏకైక టీ20కి ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, శిఖర్ ధావన్ తల్లి సునయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బీసీసీఐ కూడా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సునయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు బీసీసీఐ అందులో పేర్కొంది.
శనివారం ధావన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అందడంతో అతడు శ్రీలంక పర్యటన నుంచి మధ్యలోనే భారత్కు బయల్దేరాడు. దీంతో అతను లంకతో ఐదో వన్డేకి, ఏకైక టీ20కి దూరమైన సంగతి తెలిసిందే. కాగా, సెప్టెంబర్ 6(బుధవారం) భారత్, శ్రీలంక మధ్య ఏకైక టీ20 జరగనుంది.