|
భాగస్వామితో ప్రేమగా ఉండండి:
'లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబంతో కలిసి సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. అయితే ఈ రోజుల్లో కూడా కొందరు గృహహింసకు పాల్పడుతున్నారని తెలిసింది. ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది. దీన్ని మనం అంతమొందించాలి. భాగస్వామి పట్ల దయ, ప్రేమతో ఉండండి. గృహహింస చేయకండి' అని ట్విటర్లో శిఖర్ ధావన్ రాసుకొచ్చాడు. గృహహింసపై ఇప్పటికే దేశంలోని పలువురు క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
గృహహింసకు పాల్పడితే ఫిర్యాదు చేయండి:
గృహహింసను ఎవరైనా ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితులకు ఇటీవల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. 'మీరు గృహహింస బాధితురాలు అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ చుట్టుపక్కన వారిపై గృహహింస జరుగుతుందని మీకు తెలిసినా చెప్పండి. అందరం కలిసి గృహహింసపై లాక్డౌన్ను విధించుదాం' అని కోహ్లీ చెప్పాడు.
సానియా ఆగ్రహం:
అంతకుముందు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా గృహహింసపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మనమందరం ఐక్యంగా ఉండాలి. పురుషులు, మహిళలను సమానం గౌరవంతో చూడాలి. గృహహింస కేసులు పెరిగాయన్న నివేదికలను చూశా. ఇవి అమానుష చర్యలు. గృహహింసను నేను ఎప్పుడూ తీవ్రంగా ఖండిస్తా. అన్ని సమయాలలో మహిళలను తమతో సమానంగా పురుషులు గౌరవించాలి. ఎంతో మర్యాదగా ప్రవర్తించాలి. గౌరవం కోసం డిమాండ్ చేయాల్సిన బాధ్యత మహిళలపై ఉంది' అని సానియా పేర్కొంది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్.. బాలీవుడ్ ప్రముఖులు ఫర్హన్ అక్తర్, కరణ్ జోహర్, మాధురి దీక్షిత్ కూడా గృహహింసను అంతమొందించాలన్నారు.
239 ఫిర్యాదులు:
లాక్డౌన్లో దేశవ్యాప్తంగా గృహహింస కేసులు సంఖ్య పెరుగుతున్నాయని ఇటీవల జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) పేర్కొన్న సంగతి తెలిసిందే. మార్చి 23 నుంచి ఏప్రిల్ 16 వరకు గృహహింసకు గురవుతున్నామని 239 ఫిర్యాదులు అందాయని తెలిపారు. గృహహింస నుంచి మహిళలను కాపాడేందుకు 52 హెల్ప్లైన్లు ఏర్పాటు చేశామని ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు.