టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జీవితంలో తర్వాతి పేజీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని, అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని చెప్పాడు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన తాను ఇప్పుడు ప్రశాంతంగా నిష్క్రమిస్తున్నానని పేర్కొన్నాడు.
అయితే రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకే ధావన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో పాల్గొననున్నట్లు 38 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రకటించాడు. తన నుంచి ఆట విడదీయలేని భాగమని, తన శరీరం ఇంకా ఆటకు సహకరిస్తుందని తెలిపాడు. మైదానంలో తన స్నేహితులను తిరిగి కలుసుకుంటున్నాని, అభిమానులకు కొత్త జ్ఞాపకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ధావన్ పేర్కొన్నాడు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి సీజన్లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. ఇక గత 2023 సీజన్లో మణిపాల్ టైగార్స్ ఛాంపియన్గా నిలిచింది. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. అయితే గత సీజన్లో గౌతమ్ గంభీర్-శ్రీశాంత్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ దాదాపు పుష్కర కాలం పాటు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఎన్నో ఏళ్లు వన్డేల్లో మ్యాచ్ విన్నర్గా నిలిచిన ధావన్ 44.11 సగటుతో 6793 పరుగులు చేశాడు. అందులో 17 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో వన్డేలో ధావన్ అంతర్జాతీయ కెరీర్ మొదలైంది.
ఇక టెస్టుల్లో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. గత ఐపీఎల్ సీజన్లో గాయం కారణంగా పంజాబ్ జట్టుకు దూరమయ్యాడు. ధావన్ గైర్హాజరీలో సామ్ కరన్ పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. కాగా, లెజెండ్స్ క్రికెట్ లీగ్ సెప్టెంబర్లో జరగనుంది.