ఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్తో ప్రముఖ మేనేజ్మెంట్ కంపెనీ ఐఎంజీ రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై ధావన్ మార్కెటింగ్ వ్యవహారాలన్నీ ఐఎంజీ పర్యవేక్షించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా స్పాన్సర్షిప్, ఎండార్స్మెంట్, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు అన్నింటిని ఐఎంజీ రిలయన్స్ కంపెనీ చక్కబెడుతుంది.
'మేటి మేనేజ్మెంట్ కంపెనీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉంది. మైదానంలో నేను నా ఆటను చూసుకుంటే.. నా మార్కెటింగ్ అంశాల్ని ఇప్పుడు ఐఎంజీ చూసుకుంటుంది. ఇది నా ప్రతిభకు గరిష్ట ప్రయోజనాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది' అని శిఖర్ ధావన్ ఒక ప్రకటనలో తెలిపాడు. ధావన్ లాంటి స్టార్ క్రికెటర్తో ఒప్పందం కుదుర్చుకోవడం తమ కంపెనీ బ్రాండ్ విలువను పెంచుతుందని ఐఎంజీ రిలయన్స్ హెడ్ నిఖిల్ బర్దియా తెలిపారు.
2016లో టాలెంట్ మేనేజ్మెంట్ విభాగాన్ని ప్రారంభించిన ఐఎంజీ రిలయన్స్.. తక్కువ వ్యవధిలోనే స్టార్ ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్తో సహా పలువురు క్రికెటర్ల మార్కెటింగ్ అంశాల్ని ఐఎంజీ చూసుకుంటున్నది. అంతర్జాతీయ కెరీర్లో గబ్బర్ ఇప్పటివరకు 34 టెస్టుల్లో, 136 వన్డేల్లో, 61 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 24 శతకాలు బాదాడు.
చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మధ్యలోనే భారత్కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోనూ (రాజ్కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్ నుంచి ధావన్ గాయపడడం అది నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. ఇప్పడు ఏకంగా నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఒకపక్క ఫిట్నెస్పై దృష్టి పెడుతూనే మరోవైపు కుటుంబ సభ్యులతో సమయం ఆస్వాదిస్తున్నాడు.
'భారత క్రికెట్పై గంగూలీ చెరగని ముద్ర వేస్తే.. కోహ్లీ దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు'