
ముంబై: ఇంగ్లీషు జట్టుతో జరుగుతున్న టీమిండియా రెండో టెస్టు సమరంలో.. ఓపెనర్ శిఖర్ ధావన్కు సిరీస్లో మరో అవకాశం ఇవ్వాలంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చెప్పారు. గత విదేశీ పర్యటనల్లోనూ ధావన్ను కేవలం తొలి టెస్టుకు మాత్రమే పరిమితం చేసి.. పక్కన పెట్టేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
'ధావన్ విషయంలో నేనెప్పుడూ ఒకటే చెబుతాను. తొలి టెస్టు ఆడగానే అతణ్ని తప్పిస్తారు. కానీ మిగిలిన వాళ్లకు ఒకటికి మించిన అవకాశాలు లభిస్తాయి. శిఖర్కు కూడా రెండో అవకాశం ఇవ్వాలి. తొలి టెస్టునే చూసుకుంటే మురళీ విజయ్, కేఎల్ రాహుల్ కంటే అతను ఎక్కువ పరుగులే సాధించాడు. మరి అతణ్ని ఏ ప్రాతిపదికన రెండో టెస్టు నుంచి తప్పించారు? పిచ్కు తగ్గట్టుగానే తుది జట్టు ఉండాలి. ధావన్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. అతను జట్టుకు వైవిధ్యాన్ని తీసుకొస్తాడు' అని సన్నీ చెప్పాడు.
వీవీఎస్ లక్ష్మణ్ కూడా ధావన్ను తప్పించడాన్ని తప్పుపట్టాడు. 'తొలి టెస్టులో కెప్టెన్ కోహ్లి మినహా బ్యాటింగ్లో అందరూ విఫలమయ్యారు. రాహుల్, విజయ్లతో పోలిస్తే ధావన్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అతని ఫుట్వర్క్ బాగుంది. మిగతా బ్యాట్స్మన్లపై కాకుండా కేవలం అతనిపైనే వేటు ఎందుకు పడింది' అని లక్ష్మణ్ తెలిపాడు. రెండో టెస్టులో జట్టులో రెండు కీలక మార్పులు చేసిన కోహ్లీ అండ్ మేనేజ్మెంట్ దానికి తగ్గట్లు వివరణ ఇవ్వలేకపోయింది.
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ కలిపి ధావన్ చేసిన స్కోరు 39పరుగులు. ఆ స్కోరు మిగిలిన ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్, మురళీ విజయ్ కంటే ఎక్కువే. కానీ, అవేమీ పట్టించుకోకుండా ధావన్ బదులు చతేశ్వర్ పూజారాను తీసుకుంటూనే.. రెండో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను జట్టులో ఆడించారు. అదీ కాకుండా వర్షం పడి తడిచిన పిచ్ కాసేపటికే తేమను సంతరించుకోవడంతో స్పిన్నర్లకు అనుకూలించలేదు. కోహ్లీతో సహా బ్యాట్స్మెన్ అంతా యథావిధిగా ఫెయిలైయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు.. భారత్పై 250 పరుగుల ఆధిక్యంలో నిల్చొంది.