హైదరాబాద్: శిఖర్ ధావన్... భారత జట్టులో ఈ మధ్య కాలంలో టీమిండియాకు కీలక విజయాలను అందిస్తున్న ఆటగాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 132 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
భారత క్రికెటర్ శిఖర్ ధవన్ని ముద్దుగా గబ్బర్ అని పిలిచే విషయం తెలిసిందే. తొలి వన్డే అనంతరం ధావన్ క్రికెట్ టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో తనకు ఇష్టమైన క్రికెటర్, తారలు, సినిమా గురించి వెల్లడించాడు. శిఖర్ ధావన్కి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టమట.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే కరీనా కపూర్ అంటే ఎనలేని ఇష్టమట. అమీర్ ఖాన్-కరీనా కపూర్ ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన త్రీ ఇడియట్స్ బాలీవుడ్లో రికార్డుల సునామీనే సృష్టించింది. కాబట్టి ఈ సినిమానే ధావన్కి ఇష్టమైన సినిమా అనుకుంటే పొరపడినట్లే.
1976లో హాలీవుడ్ దర్శకుడు జాన్ ఎవిల్సన్ దర్శకత్వంలో వచ్చిన 'రాకీ' సినిమా అంటే ధావన్కి ఎంతో ఇష్టమట. రాకీ సినిమాలో సిల్వస్టర్ స్టాలోన్ హీరో. ఈ సినిమాను ఇప్పటికి ఎన్నిసార్లు చూశాడో ధావన్కి అసలు గుర్తే లేదంట. ఇక తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కరే.
ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానం ధావన్ ఫేవరెట్ గ్రౌండ్. ఇదిలా ఉంటే కెప్టెన్ కోహ్లీకి కూడా అమీర్ ఖాన్ అంటే ఎంతో ఇష్టం. ఇదిలా ఉంటే ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 24 (గురువారం) పల్లెకెలె వేదికగా జరగనుంది.