

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటి వరకు బ్యాట్తో మాయ చేశాడు. ఇక నుంచి పిల్లన గ్రోవితోనూ మాయ చేసేందుకు సిద్ధమయ్యాడు. ధావన్ ఏంటి పిల్లనగ్రోవి ఏంటా అని అనుకుంటున్నారా. ఈ కింది వీడియో చూస్తే మీకే అర్ధమౌతోంది. గత మూడేళ్లుగా గబ్బర్ సంగీత వాయిద్య పరికరం ఫ్లూట్(పిల్లనగ్రోవి) ఊదడాన్ని నేర్చుకుంటున్నాడట. ఈ విషయాన్ని ధావనే స్వయంగా వెల్లడించాడు.
అంతేకాదు తాను ఫ్లూట్ ఊదుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ రోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకుందామనుకుంటున్నాను. నాకు ఎంతో ఇష్టమైన, నాలోని రెండో కోణం ఇది. గత మూడేళ్లుగా నేను నాకు ఎంతో ఇష్టమైన సంగీత వాయిద్య పరికరం ఫ్లూట్ ఊదడం నేర్చుకుంటున్నాను. గురువు వేణుగోపాల్ వద్ద శిక్షణ పొందుతున్నాను. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన నేను ఇప్పుడు ఒక రాగాన్ని ఊదగలుగుతున్నాను.
ఇక్కడ మీరు అర్థం చేసుకోవల్సిందల్లా ఒకటే.. ఏ వయస్సులోనైనా మనకు కావాల్సింది నేర్చుకోవడం. ఆత్మసంతృప్తి చెందడం. మీ అందర్ని నేను ప్రోత్సహిస్తున్నాను' అని ధావన్ పేర్కొన్నాడు. శిఖర్ ధావన్ ఫ్లూట్ మోగిస్తోన్న వీడియోను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
కాగా, ధావన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్కు వరకూ చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2018 సీజన్లో 16 మ్యాచ్లు ఆడి 497 పరుగులు చేశాడు. ధావన్ అత్యధిక స్కోరు 92 పరుగులుగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్తో తలపడిన హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ధావన్.. జూన్ 14 నుంచి అఫ్గానిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టుకు ధావన్ సన్నద్ధం అవుతున్నాడు.