హైదరాబాద్: మైదానంలో ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో కనిపించే గబ్బర్.. శిఖర్ ధావన్. ట్విట్టర్ వేదికగా మరోసారి తన వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టాడు. 'ప్రతి రోజు నా నవ్వుకు వీరే కారణం. వీరు లేకపోతే నేను లేను' అంటున్నాడు శిఖర్ ధావన్. ఇంతకీ వారు అంటే ఎవరో తెలుసా.. అతని భార్య, పిల్లలు. ధావన్కు తన భార్య అయేషా.. ఇంకా పిల్లలంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే.
క్రికెట్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు ధావన్ కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తాడు. కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లడం, ఇంట్లో వారితో సరదాగా గడపడం లాంటివి చేస్తాడు. ఈ ఏడాది మార్చిలో శ్రీలంకలో నిదహాస్ టోర్నీ అనంతరం తిరిగి భారత్ చేరుకున్న ధావన్.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో ఉన్న కుటుంబసభ్యుల వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ధావన్ తన ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేశాడు.
My children are the reason I laugh, smile and want to get up every morning. I love you all and I couldn't imagine my life without all of you. You are the sunshine in my day, joy in my soul, and precious in every way. ❤️ pic.twitter.com/2twc2GnwSl
— Shikhar Dhawan (@SDhawan25) June 21, 2018
తన భార్య, బిడ్డలతో కలిసి పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను వీడియో రూపంలో పొందుపరిచాడు. 'ప్రతి రోజూ నా ఉదయాన్ని సంతోషంగా ప్రారంభించడానికి కారణం నా పిల్లల నవ్వులే. ఐ లవ్ యూ ఆల్. మీరు లేని నా జీవితాన్ని ఊహించలేను. నేను గడిపే ప్రతి రోజులో మీరు వెలుగును, ఆనందాన్ని నింపుతున్నారు. నాకు మీరెంతో ప్రత్యేకం' అని ధావన్ పేర్కొన్నాడు.
ఇటీవలే బీసీసీఐ నిర్వహించిన యోయో టెస్టులో ఉత్తీర్ణత సాధించిన ధావన్.. త్వరలో ఐర్లాండ్ వెళ్లే భారత జట్టుతో కలవనున్నాడు. ఈ నెల 27, 29న కోహ్లీ సేన ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.