
ఒకప్పుడు భారత క్రికెట్లో ఆ ముగ్గురి కాంబినేషన్ అత్యుత్తమంగా పేర్కొనబడేది. 2019వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియాను అగ్రగ్రామిగా నిలపడంలో ఈ టాప్ ఆర్డర్ పాత్ర ఎనలేనిది. వారి కాంబినేషన్ టీమిండియాకే గర్వకారణం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లతో కూడిన ఆ కాంబినేషన్ భారత్ ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్ల్లో గెలవడానికి ఉపయోగపడింది.
ఈ కాంబోలో ఒకరికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. అతనే శిఖర్ ధావన్. టీమిండియా క్రికెట్లో గ్రేట్గా రోహిత్, కోహ్లీని పేర్కొంటూ.. ధావన్ను మర్చిపోయారు. కొన్ని రోజులు ఫామ్ కోల్పోవడంతో 2020లో జరిగిన T20ప్రపంచ కప్ జట్టులో స్థానం కూడా ధావన్ కోల్పోయాడు. ధావన్ విషయమై మాజీ టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. అతన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. అతనొక "గన్ ప్లేయర్" అంటూ కొనియాడాడు.
శిఖర్ ధావన్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్తో తన 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 88పరుగులు చేసిన ధావన్.. టీ20ల్లో 9000పరుగులు, ఐపీఎల్లో 6000పరుగుల మైలురాళ్లను చేరున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ చెన్నైపై 11పరుగుల తేడాతో గెలుపొందింది. నిన్నటి మ్యాచ్ ముగింపు తర్వాత స్టార్ స్పోర్ట్స్తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధావన్ మైండ్సెట్ను, మ్యాచ్లో అతని క్యాలిక్యులేటివ్ అప్రోచ్ను ప్రశంసించాడు.

భారత జట్టులో కోహ్లీ, రోహిత్లు అనేక ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు. కానీ అదే సమయంలో మంచి ప్రదర్శన చేసిన ధావన్ వారితో సమానంగా ప్రశంసలు అందుకోలేకపోయాడు. సామాన్య క్రికెటర్గా మిగిలిపోయాడు. ఆటలో అతను సాధించిన అన్ని మైలురాళ్లు అతను కూడా ఎంతో ప్రశంసించదగ్గ ప్లేయర్ అని తెలియజేస్తున్నాయన్నాడు.
'ధావన్ మ్యాచ్ సిచ్యువేషన్ను అర్థం చేసుకుంటాడు. తానేం చేయాలో నిర్ణయించుకుంటాడు. పిచ్ స్వభావాన్ని అంచనా వేస్తాడు. షాట్ల ఎంపికలో, నో ఫీల్డింగ్ జోన్లో ఆడడంలో, హిట్ చేసే వీలున్న బౌలర్ బౌలింగ్లోనే హిట్టింగ్ చేయడంలో.. అతను సమర్థుడు. అతని ఆలోచనా విధానాన్ని, తనను తాను ఇంప్రూవ్ చేసుకున్న విధానాన్ని అతని బ్యాటింగ్ శైలి చూపిస్తోంది. నేను అతన్ని గన్ ప్లేయర్ అని పిలుస్తాను. ఎందుకంటే ఇండియాలో చాలా ప్రశంసలు రోహిత్, విరాట్లకు వచ్చాయి. వారితో సమానమై తీవ్రత ఉన్న ఆటగాడు ధావన్.
ఐపీఎల్లో 6000పరుగులు, 200 మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, తనదైన శైలిలో ఇన్నింగ్స్ ముగించడం, యువకులకు సలహాలు ఇవ్వడం ఇలా ఒక్కటేమిటే చాలా విషయాల్లో ఈ మ్యాచ్ ధావన్కు ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పవచ్చు. అతను ప్రశంసించదగ్గ ప్లేయర్.' అని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని తెలిపాడు. కాగా ధావన్ ఐపీఎల్ 2022లో ఎనిమిది ఇన్నింగ్స్లలో 302పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానానికి చేరుకున్నాడు. మరో వైపు రోహిత్, కోహ్లీ తమ ఫామ్ లేమితో సతమతమవుతుండగా.. గబ్బర్ తన పరుగుల వరదను కొనసాగిస్తుండడం గమనార్హం.