హైదరాబాద్: ఏదైనా రంగం నుంచి రిటైర్ అయితే తర్వాత కూడా దాని సంబంధిత పనులలోనే కొనసాగుతుంటారు. కానీ, కొద్ది మంది మాత్రమే.. చేసిన పనికి విరుద్ధంగా వేరే రంగాలను ఎంచుకుంటుంటారు. వీరి కోవలోకే వచ్చాడు భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్. తన రిటైర్ మెంట్ తర్వాత ఖాళీగానో, క్రికెట్ అకాడమీకి ఓనర్ గానో కాకుండా వ్యాపారంలోకి దిగుతాను అని చెప్తున్నాడు.
తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ... 'క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం నేను ఏదైనా వ్యాపార రంగంలోకి అడుగుపెడతా' తన అభిప్రాయాలను పంచుకొన్నాడు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ప్రస్తుత క్రికెట్ ఆటతీరును విశ్లేషించాడు.
'మేము క్రికెట్ ఆడే సమయంలో బౌలింగ్ చేయడం చాలా సులువుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎంతోమంది బ్యాట్స్మెన్లు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. మేము టీ20 మ్యాచ్లు అంతగా ఆడలేదు. టెస్టుల్లో ఇప్పటిలా సిక్స్లు నమోదయ్యేవి కావు. 1996లో మా జట్టు ప్రపంచ కప్ గెలవడం మధురమైన అనుభూతి. అలాగే కోచ్గా 2016లో సన్రైజర్స్ ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకోవడం నాకెంతో సంతృప్తినిచ్చింది' అని తెలిపాడు.
టోర్నీలో భాగంగా సన్రైజర్స్ తన తదుపరి మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను ఢీకొట్టనుంది. ఏప్రిల్ 19న మొహాలి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో సన్రైజర్స్ జట్టు మూడు మ్యాచ్లు ఆడింది. మూడింటిలోనూ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న జట్టు నాలుగో మ్యాచ్ లోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలనే ఆరాటంలో ఉంది. ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యేకమైన ప్రదర్శన చేసిన కెప్టెన్ విలియమ్సన్ జట్టుకు ప్రధాన బలం బౌలింగ్ను మరింత పదునుపెట్టి నాలుగో మ్యాచ్కు తీసుకురానున్నాడు.