
ఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల కుటుంబసమేతంగా ఆకలితో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించిన గబ్బర్.. తాజాగా యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశాడు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ధావన్.. శనివారం ఉదయం మజ్లిస్ మెట్రో స్టేషన్ సమీపంలోని హిందూ శరణార్థి శిబిరానికి వచ్చి అక్కడి పిల్లలు, యువతకు క్రికెట్ కిట్లు అందించాడు.
తమ అభిమాన క్రికెటర్ రాగానే అక్కడి యువకులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. శిఖర్ ధావన్ ఆటోగ్రాఫ్లు తీసుకొని సంబరపడిపోయారు. అంతేకాకుండా క్రికెట్ మెళకువలు నేర్చుకొన్నారు. చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి ఆటగాళ్ళు తమ ప్రతిభను చూపించడానికి సరైన వేదికను పొందాలని, అందుకు వారిని ప్రోత్సహించాలని ధావన్ అన్నాడు. శరణార్థి శిబిరంలో ఉన్న యువకులు క్రికెట్ ఆడటాన్ని స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న తాను వారిని ప్రోత్సహించేందుకు ఈ విధంగా కిట్లు పంపిణీ చేశానన్నాడు.
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శిఖర్ ధావన్.. ఎప్పుడూ ఏదో విషయంపై ట్వీట్లు చేస్తుంటారు. భారత-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లేహ్ చేరుకున్నప్పుడు.. లేహ్లో ఆర్మీ సిబ్బందిని కలవడం ద్వారా ప్రధాని మోదీ అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాన్ని చూపించారు. మోదీజీ యొక్క ఈ దశ మన ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులను ప్రోత్సహిస్తుంది అని గబ్బర్ ట్వీట్లో పేర్కొన్నాడ.
చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మధ్యలోనే భారత్కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోనూ (రాజ్కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. ఇప్పడు ఏకంగా నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు.