మయాంక్ అగర్వాల్కు తొలిసారి
వెస్టిండీస్ జట్టు బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్లు కొందరికి విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలిచ్చింది ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ. ప్రధాన బౌలర్లు భువనేశ్వర్, బుమ్రాలతో పాటు ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్న ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యలను కూడా సిరీస్కు దూరం పెట్టారు. ముంబై కుర్రాడు పృథ్వీ షా , హైదరాబాదీ బౌలర్ సిరాజ్తో పాటు కర్ణాటక బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.
హైదరాబాదీ సిరాజ్ కూడా
సిరాజ్ ఇంతకుముందు భారత జట్టు తరఫున మూడు టీ20లు ఆడాడు. ఇటీవల భారత్-ఎ తరఫున నిలకడగా రాణించడంతో టెస్టు జట్టులోనూ అవకాశం దక్కింది. సీనియర్ పేసర్లు మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్లతో పాటు శార్దూల్ ఠాకూర్తో కలిసి సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఇక మయాంక్ అగర్వాల్.. కేఎల్ రాహుల్తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశముంది. 2017-18 సీజన్లో అతను 36 మ్యాచ్లాడి 2,253 పరుగులు చేయడం విశేషం.
హనుమ విహారి, రిషబ్ పంత్ జట్టులో చోటు
అండర్-19 ఆటగాడైన పృథ్వీ షా సైతం దేశవాళీల్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత టెస్టు జట్టు నుంచి తప్పించిన రోహిత్ శర్మకు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. ఆసియా కప్కు దూరమైన కెప్టెన్ కోహ్లినే వెస్టిండీస్ సిరీస్ కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్తో చివరి టెస్టులో సత్తా చాటిన హనుమ విహారి, రిషబ్ పంత్ జట్టులో చోటు నిలుపుకున్నారు.
స్పిన్నర్ అశ్విన్ కూడా జట్టులోకి
గాయం నుంచి కోలుకున్న సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా జట్టులోకి పునరాగమనం చేశాడు. జడేజాకూ అవకాశం దక్కింది. అతడితో పాటు కుల్దీప్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. రాజ్కోట్లో అక్టోబరు 4 నుంచి 8 వరకు తొలి టెస్టు జరుగుతుంది. 12-16 తేదీల మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తుంది. దీని తర్వాత విండీస్తో భారత్ 5 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది.
భారత జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, ఉమేశ్, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్