
హైదరాబాద్: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇటీవలే ఓ ఇంటి వాడయ్యాడు అయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 23న యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మని వివాహం చేసుకున్నాడు. గురుగ్రామ్లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది. చహల్ తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలో పెళ్లిఫొటోలు పంచుకుని.. 'గతంలో మా పరిచయం ఏర్పడింది, మేం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం. ఇద్దరం ఒకటయ్యాం' అని దానికి కాప్షన్ జత చేశాడు.
ప్రస్తుతం ధనశ్రీ వర్మతో కలిసి దుబాయ్లో హనీమూన్ ట్రిప్ ఆస్వాదిస్తున్నాడు టీమిండియా అల్లరి పిల్లాడు. తాజాగా సంగీత్కు సంబంధించిన చిత్రాలను చహల్ పోస్ట్ చేశాడు. 'ఈ ఏడాది (2020) అత్యంత ఆసక్తి రేపిన, ఉత్సాహకరమైన ప్రదర్శనలివే' అంటూ వ్యాఖ్య జత చేశాడు. అయితే ఆస్ట్రేలియాలో భారత్ ఉండటంతో సహచరులెవరూ పెళ్లికి హాజరుకాలేదు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం సంగీత్ వేడుకకు వచ్చి చిందులు వేశాడు. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చహల్, ధావన్ ఇద్దరూ టెస్ట్ సిరీస్ ఆడని విషయం తెలిసిందే.
యుజ్వేంద్ర చహల్కి లాక్డౌన్లో పెళ్లి కుదిరింది. అప్పుడే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ 2020 ఆడేందుకు దుబాయ్కు వచ్చిన యూజీని చూసేందుకు ధనశ్రీ సైతం రావడం గమనార్హం. లీగ్ ముగిసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు దుబాయ్లో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే నూతన దంపతులు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సాక్షిసింగ్ ఆతిథ్యాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే.
భారత వన్డే, టీ20 జట్టులో రెగ్యులర్ స్పిన్నర్గా కొనసాగుతున్న యుజువేంద్ర చహల్కి టెస్టుల్లో మాత్రం అవకాశాలు దక్కడం లేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఛాన్స్ దొరికిన మ్యాచ్లో సత్తా చాటుతున్నాడు. వన్డే, టీ20ల్లో తన మాయాజాలంతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా అల్లరి కుర్రాడు చహల్ మైదానంలో ఎంతో సరదాగా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కబుర్లు చెబుతుంటాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం 'చహల్ టీవీ'తో ఆటగాళ్లను సరదాగా ఇంటర్వ్యూ చేస్తుంటాడు.