హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. 107 బంతులను ఎదుర్కొన్న ధావన్ 15 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు.
41.2వ ఓవర్లో పుష్పకుమారా వేసిన బంతిని ఫోర్గా మలిచి సెంచరీని నమోదు చేశాడు. తద్వారా ధావన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాట్స్మెన్గా వీరేంద్ర సెహ్వాగ్, చటేశ్వర్ పుజారాలతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.

సచిన్ టెండూల్కర్ శ్రీలంక గడ్డపై అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించి భారత్ తరఫున అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో ధావన్కి ఇది ఆరో సెంచరీ కాగా, శ్రీలంకపై మూడో సెంచరీ కావడం విశేషం. మరోవైపు ఈ సిరీస్లో ధావన్కి ఇది రెండో సెంచరీ. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో అతను 190 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 45 బంతులు ఎదుర్కొన్న ధావన్, హాఫ్ సెంచరీ అనంతరం కాస్తంత నెమ్మదిగా ఆడాడు. సెంచరీ అనంతరం హెల్మెట్, గ్లౌజులు తొలగించి డ్రస్సింగ్ రూమ్లో కూర్చున్న సహచర ఆటగాళ్ల వైపు విక్టరీ సింబల్ని చూపిస్తూ ధావన్ సందడి చేశాడు.
పాండ్యా, కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ ధావన్ను అభినందించారు. మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లు శిఖర్ ధావన్-కేఎల్ రాహుల్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కేఎల్ రాహుల్ 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుష్పకుమార బౌలింగ్లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 135 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 85 పరుగులు అవుటయ్యాడు.