
పూణే: ఇంగ్లండ్తో పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఐదవ భారత లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మన్గా ధావన్ రికార్డుల్లోకి ఎక్కాడు. తొలి వన్డే ద్వారా ఆసియాలో గబ్బర్ 5000 వేల పరుగులు పూర్తిచేశాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) గబ్బర్ కంటే ముందున్నారు.
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆచితూచి ఆడారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ పరుగులు చేశారు. ఈ క్రమంలో రోహిత్, ధావన్ తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. అయితే బెన్ స్టోక్స్ వేసిన 16వ ఓవర్ తొలి బంతికి రోహిత్ (28) ఔటయ్యాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడడంతో బంతి బ్యాట్ ఎడ్జ్కు తీసుకొని కీపర్ చేతుల్లో పడింది. దీంతో భారత్ 64 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
రోహిత్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో వచ్చాడు. ధావన్కు జత కలిసిన కోహ్లీ వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ జీవనాధారం లభించిన గబ్బర్.. బౌండరీలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ధావన్ అర్ధ శతకం సాధించాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో సిక్స్ బాదిన గబ్బర్.. హాఫ్ సెంచరీ చేశాడు. 68 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధావన్ ఇంగ్లీష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నాడు. ప్రస్తుతం ధావన్, కోహ్లీ భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా వీరిద్దరి బ్యాటింగ్ సాగుతోంది. 24 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. కోహ్లీ (27), ధావన్ (52) క్రీజులో ఉన్నారు.