
హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్మన్గా చరిత్ర సృష్టించాడు.
ధావన్కి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (93 ఇన్నింగ్స్)ల్లో ఈ ఘనత సాధించగా ధావన్ 95 ఇన్నింగ్స్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(105 ఇన్నింగ్స్ల) రికార్డుని తాజాగా అధిగమించాడు.
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్ మెన్గా అరుదైన గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా (81 ఇన్నింగ్స్ల్లో) తొలి స్థానంలో ఉండగా... రిచర్డ్స్(88), జోరూట్(91), విరాట్ కోహ్లి(93), వార్నర్(93)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే మూడో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (100 నాటౌట్; 85 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించడంతో 32.1 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించింది.
మరో బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ (65; 63 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. శ్రీలంక బౌలర్లలో ధనుంజయ, పెరీరా తలో వికెట్ తీసుకున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.