హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన కెరీర్లోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించాడు.
కేవలం 71 బంతుల్లోనే 132 పరుగులు సెంచరీ చేసిన ధావన్ మరో రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకపై తాను ఆడిన చివరి ఆరు వన్డేల్లోనూ శిఖర్ ధావన్ 50కిపైగా పరుగులు చేసి, అంతర్జాతీయ వన్డేల్లో ఓ ప్రత్యర్థి జట్టుపై ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు.

శ్రీలంకతో తాను ఆడిన చివరి ఆరు వన్డేల్లో ధావన్ వరుసగా 94, 113, 79, 91, 125, 132 పరుగులు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే శ్రీలంకపై వరుసగా ఐదుసార్లు 50కి పైగా స్కోరు సాధించిన వారిలో టీమిండియా మాజీ ఆటగాళ్లు నవ్జోత్ సింగ్ సిద్ధు, మొహమ్మద్ అజారుద్దీన్ ఉన్నారు.
కాగా, శ్రీలంకపై వరుసగా చేసిన ఆరు 50కి పైగా పరుగులే కాకుండా ధావన్ గతంలో మరో హాఫ్ సెంచరీ కూడా చేశాడు. దీంతో శ్రీలంకపై మొత్తం ఏడు సార్లు 50కిపైగా పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టుపై ఏడుసార్లు 50కిపైగా పరుగులు చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన ధావన్ నిలిచాడు.
ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటైంది. లంక ఓపెనర్ డిక్వెలా (64) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అనంతరం శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ (4) విఫలమైనా ధావన్, కోహ్లీ రెండో వికెట్కు అజేయంగా 197 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా రెండో వన్డే ఆగస్టు 24న పల్లెకెలె వేదికగా జరగనుంది.