టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్-అయేషా ముఖర్జీ జంట తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తమ జంట విడాకులు తీసుకుంటున్నట్లు అయేషా ముఖర్జీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఎప్పుడూ సంతోషంగా,హుషారుగా కనిపించే ఈ జంట ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం గబ్బర్ అభిమానులను షాక్కి గురిచేసింది. అయేషా ప్రకటనపై గబ్బర్ ఇంకా స్పందించలేదు.
శిఖర్ ధావన్-అయేషా ముఖర్జీలది ప్రేమ వివాహం. 2012లో వీరి వివాహం జరిగింది. మెల్బోర్న్ బాక్సర్ అయిన అయేషా ముఖర్జీకి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భర్తతో ఆమె విడాకులు తీసుకున్నారు. ధావన్,అయేషా దంపతులకు 2014లో జొరావర్ జన్మించాడు.విడాకుల గురించి ఇన్స్టాగ్రామ్లో అయేషా భావోద్వేగపూరితంగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

'రెండోసారి విడాకులు తీసుకునేంతవరకు విడాకులంటే అదేదో చెడ్డ పదంలా భావించేదాన్ని. ఫన్నీ... విడాకులు,వివాహం వంటి పదాలకు ఎంత శక్తివంతమైన అర్థాలు,అనుబంధాలు ఉంటాయో.మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను.జీవితంలో నేనేదో విఫలమైనట్లు... చేయకూడని తప్పు చేసినట్లు బాధపడ్డాను. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు,పిల్లలను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. ఇది ఊహించుకుంటే భయానకంగా ఉంది. ఇప్పుడు మళ్లీ నన్ను నేను నిరూపించుకోవాలి.' అని అయేషా ముఖర్జీ ఇన్స్టాలో పేర్కొన్నారు.
ఐపీఎల్ సెకండ్ హాఫ్లో ఆడేందుకు శిఖర్ ధావన్ ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ టీమ్తో యూఏఈలో ఉన్నాడు. మరోవైపు,రేపు టీ 20 వరల్డ్ కప్కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఇప్పటికే రోహిత్ శర్మకు ఓపెనర్ స్థానం ఫిక్స్ అవగా... రెండో ఓపెనర్ కోసం గబ్బర్ కేఎల్ రాహుల్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నాడు.