ఢాకా: గతంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టుకు ఎలా ఆడాడో.. ఇకపై ఆ పాత్రను ధావన్ పోషించగలడని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఒక్క సెషన్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా అతనికి ఉందని ప్రశంసించాడు.
టెస్టుల్లోనూ రిజర్వ్ డేను ప్రయత్నించవచ్చని.. ఫలితం వస్తుందనుకుంటే మరో రోజు ఆటను పొడిగించాలనే ఆలోచన మంచిదేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 'వర్షం వల్ల మాకు ఎక్కువ సమయం లేదని తెలుసు. స్వార్థం లేకుండా వేగంగా ఆడేందుకు మా బ్యాట్స్మెన్ ప్రయత్నించడం అభినందించాల్సిన విషయం' అని పేర్కొన్నాడు.

'ఐదు రోజులూ మొత్తం మ్యాచ్ జరిగితే బాగుండేది. అయితే మైదానంలో ఉన్నంత సేపు కుర్రాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడారు. ఇన్ని విరామాల తర్వాత అదే జోరు కొనసాగించడం అంత సులువు కాదు. హర్భజన్, అశ్విన్ల ప్రదర్శన కూడా కెప్టెన్గా సంతృప్తినిచ్చింది' అని కోహ్లీ తెలిపాడు. 'భజ్జీ, అశ్విన్లు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగారు. నా దృష్టిలో సరైన జట్టునే ఎంపిక చేసుకున్నాం. వాతావరణం బాగుంటే మా వ్యూహాలు బాగా పని చేసేవి' అని తెలిపాడు.
ఏకైక టెస్టులో మ్యాన్ ఆఫ్ ది గెలుచుకున్న శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. 'నా బ్యాటింగ్ను ఆస్వాదించాను. వికెట్ చాలా అనుకూలంగా అనిపించింది. మరో ఎండ్లో విజయ్లాంటి బ్యాట్స్మన్ ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా ఆడవచ్చు' అని తెలిపాడు. 'వర్షం ఆగిన తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు కొన్ని బంతులు అవసరమయ్యాయి. అయితే వానపై అతిగా దృష్టి పెట్టి ఏకాగ్రత కోల్పోలేదు' అని చెప్పాడు.
ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీత్ మాట్లాడుతూ.. తమ ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'ప్రత్యర్థి బ్యాట్స్మెన్లాగే మేం కూడా భారీ స్కోర్లు చేయాలనే కోరుకున్నాం. కానీ అశ్విన్ బౌలింగ్ వల్ల అది సాధ్యం కాలేదు' తెలిపాడు.
'పిచ్ పేసర్లకు పెద్దగా అనుకూలంగా లేదు. పైగా కనీసం 140 కి.మీ.కు పైగా వేగంతో బంతులు విసిరే బౌలర్ మా జట్టులో లేకపోవడం వల్లే ఒకే పేసర్తో బరిలోకి దిగాం. దీనిపై చర్చ అనవసరం. వన్డేల్లో రాణించాలని పట్టుదలగా ఉన్నాం' ముష్ఫికర్ రహీమ్ పేర్కొన్నాడు.