కోల్కతా: ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్పై ప్రతీకార విజయం సాధించింది పాకిస్థాన్. 55 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్.. ఆసియా కప్ టోర్నీలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోరు చేసింది. ఆసియా కప్లో పాకిస్థాన్ను ఓడించినందుకు ప్రతీకారంగానే పాక్ ఆటగాళ్లు రెచ్చిపోయారా? అన్నట్లు ఆడారు. బంగ్లాదేశ్ బౌర్లను ప్రారంభం నుంచి ధాటిగా ఎదుర్కొన్న పాక్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు.
షర్జీల్ ఖాన్ 18, అహ్మద్ షెహజాద్ 52, మొహమ్మద్ హఫీజ్ 64 పరుగులతో రాణించారు. ఉమర్ అక్మల్ డకౌట్ అయ్యాడు. అనంతరం షాహిద్ అఫ్రిదీ ధాటిగా ఆడాడు. అఫ్రిదీ కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు.

షోయబ్ మాలిక్ 14, అమద్ వసీం 0 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ 202 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా ముందుంచింది. కాగా, బంగ్లా బౌలర్లలో అరాఫత్ సన్నీ 2, తస్కిన్ అహ్మద్, సబీర్ రెహమాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదన కోసం మైదానంలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు గెలుపు కోసం పోరాడారు. షకీబ్ అల్ హసన్ ఒంటరి పోరాటం చేశాడు. 40 బంతుల్లో 50 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మిగితా ఆటగాళ్లెవరు అంతగా రాణించలేకపోయారు.
ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ 24, సౌమ్యా సర్కార్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత సబీర్ రెహమాన్ 25, మహ్మదుల్లా 4, ముష్ఫీకర్ రహీమ్ 18, మొహమ్మద్ మిథుమ్ 2 పరుగులు చేసి పాక్ బౌలర్ల ధాటికి మైదానం విడిచారు. మష్రఫే మొర్తజా 15 పరుగులతో అజేయంగా నిలిచాడు.
పాకిస్థాన్ బౌలర్లలో మొహమ్మద్ అమీర్, షాహిద్ అఫ్రిదీ తలో 2 వికెట్లు, ఇమద్ వసీమ్, మొహమ్మద్ ఇర్ఫాన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో ఆల్ రౌండర్ ప్రతిభ కనబర్చిన అఫ్రిదీ పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.